హైదరాబాద్: యువతులను తమ హోటల్ గదులకు ఆహ్వానించి నిబంధనలను ఉల్లంఘించిన ఇద్దరు జాతీయ జట్టు ఆటగాళ్లకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారీ జరిమానా విధించింది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్టు అధికారిక ప్రకటన చేసింది.
వివరాల్లోకి వెళితే ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్)లో ఆడుతున్న పేస్ బౌలర్ అల్ అమీన్ హుస్సేన్, బ్యాట్స్మన్ షబ్బీర్ రహమాన్కు సుమారు రూ.10,00,000 చొప్పున (15,000 డాలర్లు) జరిమానా విధించింది.
అంతేకాదు ఐసీసీ క్రమశిక్షణ నిబంధనలను ఉల్లఘించి పెద్ద తప్పు చేశారని, మరోసారి ఇలాంటివి జరిగితే కఠినంగా శిక్షిస్తామని వార్నింగ్ ఇచ్చింది. బీపీఎల్లో ఆడుతున్న ఆటగాళ్లు జాతీయ జట్టుకు సేవలందించాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేసింది.
జాతీయ జట్టు ప్రతిష్టను దిగజార్చే పనులు చేయొద్దని, మరోసారి ఇలా జరిగే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బంగ్లా బోర్టు హెచ్చరించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాదిరి బంగ్లాదేశ్లో ఆ దేశ బోర్టు బీపీఎల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుత ఎడిషన్లో ఏడు ప్రాంఛైజీలు పాల్గొంటున్నాయి. బీపీఎల్లో పాకిస్ధాన్కు చెందిన షాహిద్ అప్రిదీ, వెస్టింగ్ స్టార్ ప్లేయర్ క్రిస్ గేల్, శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర లాంటి దిగ్గజ ఆటగాళ్లు కూడా ఆడుతున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గతంలో బంగ్లా బోర్డు ఇంత పెద్ద మొత్తంలో భారీ జరిమానా విధించడం ఇదే తొలిసారి.
బీపీఎల్లో బారిసల్ బుల్స్ జట్టు తరుపున ఆల్ అమీన్ ఆడుతున్నాడు. అమీన్కు విధించిన జరిమానా అతడి కాంట్రాక్టులో 50 శాతం కావడం విశేషం. ఇక రాజ్ షాహి కింగ్స్ జట్టు తరుపున ఆడుతున్న షబ్బీర్ రెహమాన్కు విధించిన జరిమానా అతడి కాంట్రాక్టులో 30 శాతంగా ఉంది.