హైదరాబాద్: బ్యాటింగ్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇచ్చే సలహాలు ఎవరికైనా ఎంతో అమూల్యం. తాజాగా ముంబైలో సచిన్ టెండూల్కర్ నుంచి అలాంటి సలహాలనే రహానే పొందాడు. ఆసీస్తో సిరీస్కు ముందు ముంబైలో ప్రాక్టీస్ చేస్తుండగా సచిన్తో మాట్లాడటం తనకు ఎంతో కలిసొచ్చిందని రహానే తెలిపాడు.
'నాలుగు రోజుల పాటు నేను బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ప్రాక్టీస్ చేశాను. అక్కడ సచిన్ను కలిశాను. అప్పుడతను.. 'నీ ఆట నువ్వాడు. అవకాశాలు కొన్నిసార్లు వస్తాయి. కొన్నిసార్లు రావు. ప్రిపరేషనే నీ చేతుల్లో ఉంటుంది. సరైన దృక్పథంతో ఉండటం ముఖ్యం' అని చెప్పాడు.
'నా టెక్నిక్ గురించి సచిన్ ఏమీ మాట్లాడలేదు. ఆస్ట్రేలియా బౌలర్లు ఎలాంటి లైన్, లెంగ్త్లో బంతులు వేస్తారో, వాటినెలా ఎదుర్కోవాలో, ఎలా సన్నద్ధమవ్వాలో చెప్పాడు. సచిన్తో మాట్లాడాక నా ఆత్మవిశ్వాసం పెరిగింది' అని రహానే అన్నాడు.
నిజానికి రహానే ఒకప్పుడు జట్టులో రెగ్యులర్ ఆటగాడు. శ్రీలంక పర్యటనకు ముందు జరిగిన వెస్టిండిస్ పర్యటలో మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని సైతం గెలుచుకున్నాడు. అయితే ఇప్పుడు తుది జట్టులో చోటు కోసం నానా ఇబ్బందులు పడుతున్నాడు.
ఒక సిరిస్ ఆడితే, ఇంకో సిరిస్లో బెంచ్కు పరిమితమవుతున్నాడు. ఎవరైనా గాయపడితేనో లేదా విశ్రాంతి కల్పిస్తేనో అతడికి అవకాశం దక్కుతోంది. వెస్టిండీస్తో వన్డే సిరీస్లో రాణించినప్పటికీ అతడికి శ్రీలంక సిరీస్లో అవకాశం దక్కలేదు. ధావన్ దూరమవడంతో ఇప్పుడు ఆసీస్ సిరీస్లో అవకాశం దక్కింది.
ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం మూడో వన్డే జరగనుంది. ఇండోర్లో ఆస్ట్రేలియాతో మూడో వన్డే కోసం ప్రాక్టీస్ తర్వాత రహానే మీడియాతో మాట్లాడాడు.