న్యూఢిల్లీ: సుప్రీం కోర్టులో బీసీసీఐకి ఎదురుగాలి వీస్తూనే ఉంది. క్రికెట్లో కొత్త సంస్కరణలకు తెరలేపుతూ జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసుల అమలుపై సుప్రీం కోర్టు తీర్పును పునఃసమీక్షించాలనే బీసీసీఐ రివ్యూ పిటిషన్ను తోసిపుచ్చింది. లోధా కమిటీ సిఫారసుల అమలుపై బీసీసీఐ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను మంగళవారం సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది.
అయితే తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేస్తూ పిటిషన్ను కొట్టిపారేసింది. ధర్మాసనం ఆమోదం తెలిపిన సంస్కరణలను తిరిగి పరిశీలించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాదు లోధా సిఫారసులను అమలు చేయని పక్షంలో ప్రస్తుతం ఉన్న పరిపాలనా విభాగాన్ని పూర్తిగా తొలిగించి స్వత్రంత్య వ్యవస్థను ఏర్పాటు చేస్తామని బీసీసీఐకి సుప్రీం రెండు రోజులు క్రితం ఘాటైన హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం వరకు తాము లోధా కమిటీ సిఫారసులను అమలు చేయలేమని కొంత గడువు కావాలని సుప్రీంను బీసీసీఐ కోరింది.
వదలం: లోథా సంస్కరణలపై సుప్రీంలో తీర్పు రిజర్వ్
దీంతో సోమవారం తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో జస్టిస్ లోధా సిఫారసులను తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి బోర్డుకు ఏర్పడింది. బీసీసీఐలో సరికొత్త సంస్కరణలను సూచిస్తూ లోధా కమిటీ చేసిన సిఫారసులపై సుప్రీం కోర్టు సంతృప్తి వ్యక్తం చేస్తూ.. వాటిని యథాతధంగా అమలు చేయాలని జూలై 18న తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
అయితే లోథా కమిటీ సిఫారసుల అమలుపై బోర్డు మొండి వైఖరిని ప్రదర్శించి కంటి తుడుపుగా కొన్నింటిని అమలు చేయగా.. ఒక వ్యక్తికి ఒకే పదవి, ఒక రాష్ట్రానికి ఒక్కటే ఓటు, గరిష్ఠ వయోపరిమితి, కూలింగ్ ఆఫ్ పీరియడ్ లాంటి కీలకమైన అంశాలను బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో వ్యతిరేకించారు.
లోథా ఎఫెక్ట్: బీసీసీఐ అధ్యక్ష పీఠం గంగూలీని వరించనుందా?
అంతేకాదు రివ్యూ పిటిషన్ విచారణలో భాగంగా చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ను కేసు విచారణ నుంచి తప్పించాలని బోర్డు కోరింది. ఠాకూర్ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించింది. సుప్రీం తీర్పు రాజ్యాంగ విరుద్ధమని రివ్యూ పిటిషన్లో బీసీసీఐ ఆరోపించింది. దీంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.