హైదరాబాద్: టీమిండియా దిగ్గజ స్పిన్నర్, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మంగళవారం (అక్టోబర్ 17)న 47వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బీసీసీఐ మొక్కుబడిగా శుభాంక్షలు తెలిపింది. కెప్టెన్గా, కోచ్గా భారత క్రికెట్కు ఎనలేని సేవలు అందించిన జంబోని కేవలం మాజీ బౌలర్ అని పేర్కొంటూ క్రికెట్ బోర్డు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.
ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత కెప్టెన్ కోహ్లీతో అభిప్రాయబేధాలు రావడంతో అనిల్ కుంబ్లే కోచ్ పదవి నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా ఏదో ట్వీట్ చేద్దాంలే అన్నట్లుగా జంబో పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేసింది.
దీంతో బీసీసీఐ వ్యవహార శైలిపై క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. కేవలం బౌలర్ మాత్రమేనా? జట్టుకు కెప్టెన్గా, కోచ్గా పని చేయలేదా? టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసింది కుంబ్లే కాదా? అని నెటిజన్లు బీసీసీఐకి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తూ విమర్శించారు.
అంతేకాదు జంబో ఓ దిగ్గజ ఆటగాడని భారత క్రికెట్కు 18 ఏళ్ల పాటు తన సేవలందించాడని సరైన గౌరవం ఇవ్వండి అంటూ బోర్డును చురకలు అంటించారు. అభిమానుల ఆగ్రహంతో దిగొచ్చిన బోర్డు తన తప్పుని సరిచేసుకుంది. తొలుత ట్వీట్ చేసిన 'మాజీ బౌలర్' ట్వీట్ను తొలగించింది.
ఆ తర్వాత మరో ట్వీట్లో 'టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేకు జన్మదిన శుభాకాంక్షలు. లెజెండ్, హ్యాపీ బర్త్ డే జంబో' అంటూ పేర్కొంది. భారత్ తరఫున 132 టెస్టులాడిన కుంబ్లే 619 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధికంగా ఎనిమిది సార్లు 10 వికెట్లు, 35 సార్లు 5 వికెట్లను దక్కించుకున్నాడు.
భారత్ తరుపున 271 వన్డేలు ఆడిన కుంబ్లే 337 వికెట్లను తీసుకున్నాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్కు అనిల్ కుంబ్లే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత చాన్నాళ్లకు 2016 జూన్ 24న కుంబ్లే టీమిండియా హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. భారత జట్టుకు అద్భుతమైన విజయాలను కట్టబెట్టాడు. ఆ తర్వాత జూన్లో కుంబ్లే తన కోచ్ పదవికి రాజీనామా చేశాడు.
Here's wishing a very happy birthday to former #TeamIndia Captain Mr. Anil Kumble #Legend #HappyBirthdayJumbo pic.twitter.com/uX52m8yYif
— BCCI (@BCCI) 17 October 2017