హైదరాబాద్: టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్కు ఇది నిజంగా చేదు వార్తే. తనపై ఉన్న జీవితకాల నిషేధాన్ని ఎత్తివేయాలని అతడు పెట్టుకొన్న అభ్యర్థనను బీసీసీఐ తిరస్కరించింది. ఇదే విషయాన్ని కేరళ హైకోర్టుకు బీసీసీఐ తెలియజేసింది. అంతేకాదు స్కాటిష్ క్రికెట్ లీగ్ ఆడేందుకు అతనికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేమని తెలిపింది.
బీసీసీఐ మాజీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని తాము మార్చలేమని బీసీసీఐ తేల్చి చెప్పింది. 2013 స్ఫాట్ఫిక్సింగ్ కుంభకోణంలో తనపై విధించిన నిషేధం ఎత్తివేయాలని బీసీసీఐ పాలకుల కమిటీకి శ్రీశాంత్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అందుకు నిరాకరిస్తూ బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ శ్రీశాంత్కి లేఖ పంపించాడు.
'అతడిపై జీవితకాల నిషేధం కొనసాగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. అతడు ఏ ఫార్మాట్లోనూ క్రికెట్ ఆడడానికి వీల్లేదు. శ్రీశాంత్ దరఖాస్తు చేసుకొన్న కేరళలోని స్థానిక న్యాయస్థానానికి మా న్యాయవాది బదులిస్తారు' అని బీసీసీఐ అధికారి తెలిపారు. అవినీతి చర్యలను బీసీసీఐ ఎప్పటికీ సహించదని ఆయన అన్నారు.
'శ్రీశాంత్ను ఏ కోర్టూ నిర్దోషిగా ప్రకటించలేదు. అండర్ వరల్డ్తో అతడికి సంబంధాలున్నాయన్న ఆరోపణలను మాత్రమే దిగువ కోర్టులు కొట్టివేశాయి' అని తెలిపారు. శ్రీశాంత్ తనపై ఉన్న కేసులను ఢిల్లీలోని స్పెషల్ కోర్టు కొట్టేసిన తర్వాత బీసీసీఐ విధించిన నిషేధాన్ని కూడా ఎత్తేయాలని హైకోర్టును ఆశ్రయించాడు.
ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2013 మేలో శ్రీశాంత్తో పాటు, మరో ఇద్దరు రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అంకిత్ చవాన్, అజిత్ చండీలను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం వారిపై ఉన్న కేసులను కూడా కొట్టివేశారు. అయితే బీసీసీఐ అప్పటి నుంచి వారిపై జీవితకాల నిషేధాన్ని విధించింది.