హైదరాబాద్: ఇటీవల బంగ్లాదేశ్ డివిజన్ లీగ్ క్రికెట్లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్లో 4 బంతులు వేసి 92 పరుగులిచ్చిన బౌలర్ సుజాన్ మహ్మద్పై బంగ్లాదేశ్ 10 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఆ మ్యాచ్లో అతడు బౌలింగ్ వేసిన తీరుపై పూర్తిస్థాయి విచారణ చేపట్టిన బంగ్లా క్రికెట్ బోర్డు పదేళ్ల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
దీంతో అతడు సుదీర్ఘ కాలం పాటు ఏ క్రికెట్ మ్యాచ్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. 'మా విచారణలో అతను తప్పు చేసినట్లు తేలింది. కావాలనే వైడ్లు, నోబాల్స్ వేసి ప్రత్యర్థి విజయానికి కారణమయ్యాడు. ఇది క్రీడా స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. మా దేశ క్రికెట్కు భంగం కల్గించే ఏ చర్యను ఉపేక్షించం. అందుచేతం అతనిపై 10 ఏళ్ల పాటు నిషేధం విధిస్తున్నాం' అని బంగ్లా క్రికెట్ బోర్డు క్రమశిక్షణ కమిటి చీఫ్ షేక్ సోహెల్ తెలిపారు.
మరోవైపు మ్యాచ్ను నిబంధలనకు విరుద్ధంగా నిర్వహించినందుకు ఆరు నెలల పాటు అంపైర్లను కూడా సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే...
గత కొన్ని రోజుల క్రితం ఢాకా సెకండ్ డివిజన్ లీగ్ ఓవర్ల మ్యాచ్లో లాల్మతియా క్లబ్, ఆక్సియామ్ గ్రూప్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లాల్మతియా 14 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌటైంది. లాల్మతియా బౌలర్ సుజోన్ మహ్ముద్ తొలి ఓవర్లోనే వరుసగా 13 వైడ్లు, 3 నోబాల్స్ వేశాడు.
వాటిని కీపర్ ఆపకపోవడంతో బౌండరీకి వెళ్లాయి. దీంతో ఆక్సియామ్ జట్టు ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండానే 80 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆక్సియామ్ ఓపెనర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆ తర్వాతి మూడు బంతులను బౌండరీలుగా మలిచాడు. దీంతో ఆ జట్టు కేవలం 4 బంతులు ఎదుర్కొని 92 పరుగులు చేసింది.
దీంతో కేవలం 0.4 ఓవర్లలోనే ఆక్సియామ్ జట్టు 92 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్కి ముందు అంపైర్లు తమ జట్టు విషయంలో వివక్ష ప్రదర్శించారని తమకు వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు ప్రకటించారని ఆరోపించిన లాల్మతియా క్లబ్ జట్టు అంపైర్ల తీరుపై నిరసనగా కావాలనే ఇలా చేశారు.