హైదరాబాద్: శ్రీలంక వెటరన్ క్రికెటర్ చమర కపుగెదర తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అబుదాబిలో పాకిస్థాన్తో జరిగిన మూడో వన్డేలో కపుగెదర తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48.2 ఓవర్లలో 208 పరుగులు చేసి ఆలౌటైంది.
అనంతరం 209 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 10 ఓవర్ ముగిసిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. పదో ఓవర్ ముగిశాక అంపైర్ వైపుకు కపుగెదర నడుచుకుని వస్తుండగా వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా బంతిని విసిరాడు.
అయితే కీపర్ బంతి విసరడాన్ని చివరి నిమిషంలో కపుగెదర గమనించడంతో బంతి వేగంగా వచ్చి అతడి ముఖాన్ని బలంగా తాకింది. కంటికి కొద్దిగా కింద తగలడంతో పెను ప్రమాదం నుంచి కపుగెదర తప్పించుకున్నాడు. లేదంటే కపుగెదర కన్ను పోయి ఉండేది.
బంతి బలంగా తాకడంతో అతడి కంటిపై పెద్ద బొడిపె ఏర్పడింది. విలవిల్లాడిపోయిన కపుగెదర కాసేపు అక్కడే మోకాళ్లపై కూలబడిపోయాడు. దీంతో వెంటనే అతడిని వైద్యం కోసం తరలించారు. ఎటువంటి ఫ్రాక్చర్ కాలేదని, కేవలం వాపు మాత్రమే వచ్చిందని శ్రీలంక క్రికెట్ జట్టు మేనేజర్ అశాంక గురుసిన్హా తెలిపారు.
కాగా, ఈ వన్డేలో పాక్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2012లో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్క్ బౌచర్ కూడా ఇలాగే గాయపడ్డాడు. స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ వేసిన బంతికి హుస్సేన్ క్లీన్ బౌల్డ్ కాగా, బంతి అదే వేగంతో దూసుకెళ్లి వికెట్ల వెనకాల ఉన్న బౌచర్ ముఖాన్ని తీవ్రంగా గాయపరిచింది.