హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ది ఓవల్ వేదికగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన పైనల్ సోషల్ మీడియాలో అరుదైన రికార్డును సాధించింది. పైనల్ మ్యాచ్కి సంబంధించిన సమాచారాన్ని నెటిజన్లు రికార్డు స్థాయిలో ట్వీట్ చేసినట్లు ఆసియా పసిఫిక్ స్పోర్ట్స్ పార్ట్నర్షిప్ ట్విటర్ హెడ్ అనీశ్ మదాని వెల్లడించారు.
అంతేకాదు ఈ మ్యాచ్ని 'మదర్ ఆఫ్ ఆల్ ఫైనల్స్' గా కూడా ఆయన అభివర్ణించారు. భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ రికార్డు స్థాయిలో 1.8 మిలియన్ల ట్వీట్లు నమోదయ్యాయని, గతంలో ఐసీసీ నిర్వహించిన ఏ వన్డేకి ఇంత స్థాయిలో ట్వీట్లు నమోదు కాలేదని ఆయన తెలిపారు.
ఐసీసీ వన్డే చరిత్రలోనే అత్యధిక ట్వీట్లు నమోదైన మ్యాచ్గా ఆదివారం జరిగిన భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీతో పోల్చితే ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరిగిన సమయంలో ఐసీసీ ట్విటర్ ఖాతాను ఫాలో అయిన వారి సంఖ్య నాలుగు రెట్లు అధికంగా ఉందని అన్నారు.
ఆదివారం మ్యాచ్ జరిగిన సమయంలో ట్విట్టర్లో #CT17, #INDvPAK హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయని తెలిపారు. ఈ మ్యాచ్కి సంబంధించిన వీడియోలు, ఫొటోలు, లైవ్ అప్డేట్స్, ఆటగాళ్ల ఇంటర్వ్యూలు తదితర సమాచారాన్ని ఐసీసీ అభిమానులతో పంచుకుంది.
వీటితో పాటు కొత్తగా చాట్ బాట్ డైరెక్ట్ మెసేజ్ లను కూడా ట్విట్టర్ విడుదల చేసింది. వీటితో పాటు క్రికెట్ ఫ్యాన్స్ ఈ మ్యాచ్పై తమ అభిప్రాయాలను పంచుకోవడం, విజేతగా నిలిచిన జట్టును అభినందించడం లాంటి వాటిని హ్యాష్ ట్యాగ్లను జత చేసి చేశారు.
ఈ టోర్నీలో ట్విటర్ ద్వారా తొలి ఐదు స్థానాలు దక్కించుకున్న మ్యాచ్ల వివరాలు:
1. భారత్ Vs పాకిస్థాన్(ఫైనల్)
2. భారత్ Vs పాకిస్థాన్
3. భారత్ Vs దక్షిణాఫ్రికా
4. భారత్ Vs బంగ్లాదేశ్
5. ఇంగ్లాండ్ Vs పాకిస్థాన్(తొలి సెమీఫైనల్)