హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ముగింపు దశకు చేరుకుంది. అనంతరం టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహాకం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఐపీఎల్ ముగిసిన వారం రోజుల తర్వాత న్యూజిలాండ్తో టీమిండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదే: ఒకే గ్రూప్లో భారత్, పాక్
ఛాంపియన్స్ ట్రోఫికి ముందు వార్మప్ మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ గురువారం ప్రకటించింది. జూన్ 1 నుంచి 18 వరకు జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మే 26 నుంచి 30 వరకు వార్మప్ మ్యాచ్లు జరగనున్నాయి.
టీమిండియా మే 28, 30వ తేదీల్లో రెండు వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. ఈ రెండు వార్మప్ మ్యాచ్ల్లో తొలుత న్యూజిలాండ్తో తలపడుతుండగా, రెండోది బంగ్లాదేశ్తో ఆడనుంది. రెండు మ్యాచ్లు కూడా ఇండియాలో స్టార్ స్పోర్ట్ నెట్ వర్క్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
ఇదిలా ఉంటే ఐపీఎల్ పదో సీజన్లో ఫైనల్ మ్యాచ్ మే 21(ఆదివారం) హైదరాబాద్లో జరగనుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న మహేంద్ర సింగ్ ధోని, అజ్యింకె రహానేలు ఉన్న రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్టు ఇప్పటికే ఫైనల్కు చేరింది.
ఇక క్వాలిఫియర్-2లో కోల్కతా, ముంబై జట్లు శుక్రవారం తలపడుతున్నాయి. ఈ రెండు జట్లలో గెలిచిన జట్టు ఐపీఎల్ ఫైనల్స్లో పూణెతో తలపడనుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ 8 జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి ట్రోఫీ కోసం తలపడుతున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ (GMT+1) - 3 PM IST:
26 మే (శుక్రవారం) - ఆస్ట్రేలియా Vs శ్రీలంక, ది ఓవల్ (10:30 AM)
27 మే (శనివారం) - బంగ్లాదేశ్ Vs పాకిస్తాన్, ఎడ్గ్బాస్టన్ (10:30 AM)
* 28 మే (ఆదివారం) - ఇండియా Vs న్యూజీలాండ్, ది ఓవల్ (10:30 AM)
29 మే (సోమవారం) - ఆస్ట్రేలియా Vs పాకిస్తాన్, ఎడ్గ్బాస్టన్ (10:30 AM)
30 మే (మంగళవారం) - న్యూజిలాండ్ Vs శ్రీలంక, ఎడ్గ్బాస్టన్ (10:30 AM)
* 30 మే - ఇండియా Vs బంగ్లాదేశ్, ది ఓవల్ (10:30 AM)