లండన్: మైదానంలో వికెట్ల మధ్య పరిగెత్తడమే కాదు.. ఖాళీ దొరికితే పసివాళ్లతోను పరుగులు తీస్తానంటున్నాడు టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో కలిసి ఇంగ్లాండ్ టూర్లో ఉన్న రోహిత్ శర్మ.. శిఖర్ ధావన్ గారాల కొడుకు జొరావర్తో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.
టీమిండియా బాహుబలి: రహానే చేయి పట్టుకుని, పక్కనే రోహిత్
మొన్నీమధ్యే టీమిండియా బాహుబలి అంటూ జొరావర్ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేసిన రోహిత్ శర్మ.. తాజాగా తన 'యంగ్ ట్రైనర్' అంటూ మరో వీడియోను పోస్టు చేశాడు. పాక్తో మ్యాచ్ కు సిద్దమవుతున్న తరుణంలో.. తన యంగ్ ట్రైనర్ తననెలా సిద్దం చేస్తున్నాడో చూడండంటూ ట్విట్టర్ లో ఆ వీడియో వదిలాడు.
Introducing my trainer Zoravar! Got me game ready for the semis 💪 🏃
A post shared by Rohit Sharma (@rohitsharma45) on
ఇంతకీ ఎవరా యంగ్ ట్రైనర్ అంటే!.. అది కూడా జొరావరే. హోటల్ వరండాలో జొరావర్తో పోటీ పడి పరిగెత్తుతున్న వీడియోను రోహిత్ ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఆ బుడతడి అడుగుల్లో అడుగులు వేస్తూ.. అతని వెనకాలే పరిగెత్తాడు. రోహిత్ కన్నా వేగంగా పరిగెత్తిన జొరావర్.. వెళ్లి తల్లి ఒడిలో వాలిపోయాడు. అది చూసి రోహిత్ చిరునవ్వులు చిందించాడు.
రోహిత్ పోస్టు చేసిన ఈ వీడియోకు నెటిజెన్స్ నుంచి మంచి స్పందన లభించింది. కొన్ని గంటల్లోనే లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ లో హల్ చల్ చేస్తోంది.
ఇదిలా ఉంటే, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భాగంగా భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ ఆదివారం నాడు ఓవల్ మైదానంలో జరగనున్న సంగతి తెలిసిందే. సెమీ ఫైనల్లో బంగ్లాపై సెంచరీ చేసిన రోహిత్.. ఫైనల్లోను సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.