191 పరుగులకే ఆలౌటైన దక్షిణాఫ్రికా
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 44.3 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌటైంది. డికాక్ (72 బంతుల్లో 53; 4 ఫోర్లు), డు ఫ్లెసిస్ (50 బంతుల్లో 36; 1 ఫోర్), ఆమ్లా (54 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. ఆ తర్వాత 192 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 38 ఓవర్లలో 2 వికెట్లకు 193 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.
జస్ప్రీత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్
టీమిండియా ఓపెనర్లలో ధావన్ (83 బంతుల్లో 78; 12 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో రాణించగా, కోహ్లీ (101 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) నిలకడగా ఆడారు. ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన జస్ప్రీత్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ సెమీఫైనల్ చేరాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ పైనల్లో భాగంగా బంగ్లాదేశ్తో టీమిండియా తలపడనుంది.
దక్షిణాఫ్రికాపై సత్తా చాటిన భారత బౌలర్లు
శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లు దక్షిణాఫ్రికాపై మాత్రం సత్తా చాటారు. ఓపెనర్లు ఆమ్లా, డికాక్ రిస్క్ తీసుకోకపోవడంతో భువీ (2/23), బుమ్రా (2/28) లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్తో సత్తా చాటారు. దీంతో తొలి 10 ఓవర్లలో 35 పరుగులు మాత్రమే వచ్చాయి.
ఆమ్లా ఇచ్చిన క్యాచ్ను మిస్ చేసిన పాండ్యా
ఆ తర్వాతి ఏడు ఓవర్లలో మరో 36 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో ఆమ్లా ఇచ్చిన క్యాచ్ను పాండ్యా వృథా చేశాడు. చివరకు ఆమ్లాను అశ్విన్ అవుట్ చేయడంతో తొలి వికెట్కు 76 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాతి డుఫ్లెసిస్తో నిలకడగా ఆడినా డికాక్... జడేజా బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు.
రెండో వికెట్కు 40 పరుగులు
ఈ ఇద్దరు రెండో వికెట్కు 40 పరుగులు జత చేశారు. ఇక కెప్టెన్ డివిలియర్స్ (16)ను కుదురుకోకముందే ధోనీ సూపర్ రనౌట్ చేయడంతో దక్షిణాఫ్రికా వికెట్లపతనం మొదలైంది. ఆ తర్వాత మిల్లర్ (1) కూడా రనౌట్ కావడంతో సఫారీలు కోలుకోలేకపోయారు. జెపి డుమిని (20 నాటౌట్) ఒంటరిగా పోరాడినా, మరో ఎండ్లో సహచరులు పెవిలియన్కు క్యూ కట్టారు.
51 పరుగుల తేడాతో చివరి 8 వికెట్లు
రెండో పవర్ప్లే (11-40)లో అశ్విన్, జడేజా, పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా 143 పరుగులు జోడించి 6 వికెట్లు చేజార్చుకుంది. ఓ దశలో 29 ఓవర్లలో 140/2తో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు 51 పరుగుల తేడాతో చివరి 8 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు ఈ మ్యాచ్లో 141 డాట్ బాల్స్ వేశారు. అంటే మొత్తం 23.3 ఓవర్లు మెయిడెన్లు వేసి సఫారీలను పరుగులు చేయకుండా అడ్డుకున్నారు.
తడపడిన భారత ఓపెనర్లు
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (12), శిఖర్ ధావన్లు నిదానంగా ఇన్నింగ్స్ను మొదలుపెట్టారు. పాకిస్థాన్, శ్రీలంకపై సెంచరీ భాగస్వామ్యంతో చెలరేగిన వీరిద్దరూ ఈ మ్యాచ్లో మాత్రం తడబడ్డారు. మూడు, నాలుగో ఓవర్లలో చెరో సిక్సర్ బాదినప్పటికీ, ఆరో ఓవర్లో మోర్కెల్ బౌలింగ్లో రోహిత్ శర్మ అవుటయ్యాడు.
తొలి వికెట్కు 23 పరుగులు
దీంతో తొలి వికెట్కు 23 పరుగులు జత చేశారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ కూడా నెమ్మదిగా ఆడటంతో పవర్ప్లేలో టీమిండియా 37 పరుగులు మాత్రమే చేసింది. 16వ ఓవర్లో క్యాచ్ అవుట్ నుంచి కోహ్లీ బయటపడగా, రెండో ఎండ్లో ధావన్ చెత్త బంతులను బౌండరీలుగా మలిచాడు. దీంతో 21వ ఓవర్లో భారత్ 100 పరుగుల మైలురాయిని చేరుకుంది.
మూడో వికెట్కు అజేయంగా 42 పరుగులు జత చేసిన యువీ
ఇదే క్రమంలో ధావన్ 61 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. మోరిస్ వేసిన 28వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసి కోహ్లీ కూడా అర్ధ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఆ వెంటనే ధవన్ రెండు ఫోర్లు బాది చివరకు తాహిర్కు వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో రెండో వికెట్కు 128 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. లక్ష్యం చిన్నదికావడంతో యువరాజ్ (23 నాటౌట్) ఆడుతూపాడుతూ మూడో వికెట్కు అజేయంగా 42 పరుగులు జత చేశాడు. విజయానికి 9 పరుగులు కావాల్సిన దశలో 38వ ఓవర్ ఆఖరి బంతికి భారీ సిక్సర్ బాది మరో 12 ఓవర్లు మిగిలి ఉండగానే టీమిండియాకు విజయాన్ని అందించాడు.