హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్తో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా టైటిల్ ఫేవరేట్ అని, కచ్చితంగా భారత్ కప్పు గెలుస్తుందని మెహబూబ్ హసన్ అంటున్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఇంతకీ ఎవరీ మెహబూబ్ హసన్ అనుకుంటున్నారా? పాకిస్తాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్కు స్వయానా మేనమామ. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫైనల్లో టీమిండియా తన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్తో తలపడుతున్న సంగతి తెలిసిందే.
డిఫెండింగ్ ఛాంపియన్గా, ఫేవరెట్గా బరిలోకి దిగి అంచనాలకు తగ్గ ఆటతో ఫైనల్కు దూసుకొచ్చిన భారత్.. టోర్నీని చెత్తగా ఆరంభించినా, తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుస విజయాలతో తుదిపోరుకు అర్హత సాధించిన పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోబోతున్నాయి.
లండన్లోని ఓవల్ మైదానంలో ఈ రెండు జట్ల మధ్య మధ్యాహ్నాం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడాడు. భారత్ గెలుస్తుందని తనకు నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశాడు.
తన ఆశీస్సులు ఎప్పటికీ మేనల్లుడు సర్ఫరాజ్కు ఉంటాయని, అతడు రాణించాలని కోరుకుంటానని హసన్ పేర్కొన్నాడు. ప్రపంచ జట్లలో భారత్ అత్యుత్తమ జట్టు అని, వారిని చూసి దేశం గర్విస్తుందని చెప్పాడు. భారత్లో ఉండే హసన్, పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ తల్లికి సోదరుడు.
ఈత్వా ఇంజనీరింగ్ కాలేజీలో మెహబూబ్ హసన్ సీనియర్ క్లర్క్గా విధులు నిర్వహిస్తున్నాడు. మెహబూబ్ హసన్ సోదరి అకేలా బానో పాకిస్థాన్కు చెందిన షకీల్ అహ్మద్ను వివాహం చేసుకుని ఆ దేశానికి వెళ్లిపోయింది. దీంతో సర్ఫరాజ్ తల్లిదండ్రులు పాక్లో ఉంటారన్న విషయం తెలిసిందే.
గత ఇరవై ఏళ్లలో సర్ఫరాజ్ ఒకటి రెండు పర్యాయాలు మాత్రమే హసన్ను కలుసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే లీగ్ దశలో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ భారత్ మరోసారి ట్రోఫీ నెగ్గుతుందని తాను భావిస్తున్నానని హసన్ తెలిపాడు.