కార్డిఫ్: తమ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్ ఆడాలనుకుంటున్నట్లు బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రఫే మోర్తజా తన మనసులో మాట తెలిపాడు. శుక్రవారం న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్లతో తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్ 12 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత 12వ ఓవర్లో 33 పరుగులు చేసి నాలుగో వికెట్ కోల్పోయింది. బంగ్లా ఓటమి దిశగా సాగుతుందన్న తరుణంలో షకీబుల్ హసన్(114), మహముదుల్లా(102) శతకాలతో రాణించి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. 224 రికార్డు భాగస్వామ్యంతో వీరిద్దరి బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో న్యూజిలాండ్ ట్రోఫి నుంచి నిష్ర్కమించింది.
అయితే, బంగ్లా సెమీస్ ఆశలు సజీవం కావాలంటే శనివారం జరిగే మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టును ఇంగ్లాండ్ ఓడించాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్ గెలిస్తే తమకు మంచిదే, కానీ, ఆస్ట్రేలియా ఆ మ్యాచ్లో ఓడిపోతుందని మనం ఊహించలేం కదా! అని మోర్తజా అన్నాడు. ఆ రెండు జట్లకు తాను బెస్ట్ ఆఫ్ లక్ చెబుతున్నానని, తాము చేయాల్సిన ప్రయత్నం చేశామని తెలిపాడు.
ఒక వేళ తాము సెమీస్ చేరితే గత మూడు మ్యాచ్ల కన్నా మెరుగైనా ప్రదర్శనను చూపిస్తామని మోర్తజా తెలిపాడు. గత మూడేళ్ల నుంచి కూడా తమ ఆటను మెరుగుపర్చుకుంటూ వస్తున్నామని తెలిపాడు. తమ జట్టు ఇప్పుడు బలంగానే ఉందని, 2019 ప్రపంచ కప్ టోర్నీ కోసం సిద్ధమవుతున్నామని చెప్పాడు. 11ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లా జట్టు మరోసారి న్యూజిలాండ్ పై గెలిచి తమ సత్తాను చాటింది.
న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ లో షకీబుల్ హసన్, మహముదుల్లా అద్భుతంగా రాణించి తమ జట్టుకు విజయాన్నందించారని అన్నాడు. తమీమ్ ఇక్బాల్ కు మ్యాచ్ గెలిపించే సత్తా ఉన్నప్పటికీ అతను అన్ని మ్యాచ్లలోనూ రాణించడం కష్టమేనని అన్నాడు.
కాగా, తాము నిర్దేశించిన లక్ష్యం ప్రత్యర్థి జట్టుకు సరిపోతుందని అనుకున్నాం కానీ, బంగ్లా మాత్రం అద్భుత ప్రదర్శనతో విజయాన్ని చేజిక్కించుకుందని న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ పేర్కొన్నాడు. 265 పరుగులతో భారీ లక్ష్యమే బంగ్లా ముందుంచామని అనుకున్నాం, కానీ, అంచనాలకు మించి బంగ్లా బ్యాట్స్మన్ రాణించారని తెలిపాడు.
బంగ్లా సంచలన విజయం: టోర్నీ నుంచి న్యూజిలాండ్ అవుట్
ఆస్ట్రేలియా జట్టుతో తాము బాగానే ఆడినప్పటికీ, గత రెండు మ్యాచ్ లలో తమ జట్టు ప్రదర్శన అంత చెప్పుకోదగినదిగా లేదని విలియమ్సన్ పేర్కొన్నాడు. తమకు ఈ మ్యాచ్ ఓ మంచి గుణపాఠమని, దీన్నించి చాలా నేర్చుకున్నామని తెలిపాడు.