హైదరాబాద్: ఒక్క విజయం పాకిస్థాన్ క్రికెటర్ల జీవితాలను మార్చేసింది. ఈ ఏడాది జూన్లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ జట్టు ఛాంపియన్గా అవతరించిన సంగతి తెలిసిందే. భారత్తో జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.
ఈ విజయం పాక్ ప్లేయర్లపై కాసుల వర్షం కురిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన అనంతరం సొంతగడ్డపై అడుగుపెట్టిన పాక్ క్రికెటర్లకు ఆ దేశ ప్రధాని నవాజ్ షరిఫ్ గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసి ఒక్కో ఆటగాడికి రూ. కోటి రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు.
ఆటగాళ్లతో పాటు జట్టు ప్రధాన కోచ్ ఇంజమాముల్ హక్కు రూ. కోటి మేనేజ్ మెంట్కు రూ. 50 లక్షలు, కోచ్లకు రూ. 25 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ విజయం పాక్ క్రికెటర్లను ఒక్కసారిగా ధనవంతులను చేసింది.
భారీగా డబ్బు, లగ్జరీ కార్లు, బంగ్లాలు బహుమతులుగా వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రైజ్మనీని పంపించింది. ట్రోఫీ గెలిచిన పాకిస్థాన్కు ఏకంగా రూ.23 కోట్లు వచ్చాయి. ఈ మొత్తాన్ని పన్ను కూడా విధించలేదు.
ఈ మొత్తాన్ని అందుకున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) 17 భాగాలు చేసింది. 16 భాగాలను ప్లేయర్స్కు, మిగతా ఒక భాగం మేనేజ్మెంట్కు ఇవ్వనున్నారు. ఈ లెక్క ప్రకారం ఒక్కో ఆటగాడికి రూ.కోటి 35 లక్షలు అందనున్నాయి. మరోవైపు కోచ్లు, ఇతర సహాయక సిబ్బందికి ఒక్కోక్కరికి రూ.10 లక్షలు ఇవ్వనున్నారు.