హైదరాబాద్: శుక్రవారం నుంచీ #CSKReturns #whistlepodu హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందుకు కారణం 2015లో స్ఫాట్ ఫిక్సింగ్ కేసులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో పాటు రాజస్థాన్ రాయల్స్పై సుప్రీంకోర్టు విధంచిన రెండేళ్ల నిషేధం శుక్రవారంతో ముగియడమే.
దీంతో ఐపీఎల్ 2018 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ ఐపీఎల్లోకి అడుగుపెట్టనుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్కి స్వాగతం పలుకుతూ అభిమానులు పెద్ద ఎత్తున మద్దతు తెలపుతున్నారు. తాజాగా ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన ఫేస్ బుక్లో చేసిన పోస్టు వైరల్గా మారింది.
7వ నెంబర్ చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ ధరించిన ధోనీ తన ఇంటి ముందు దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. జెర్సీపై తన పేరు కాకుండా 'తల' అని రాసుకున్నాడు. తమిళంలో తల అంటే నాయకుడు అని అర్థం. ఈ జెర్సీతో ధోనీ తన ఇంటి ముందు నిల్చోగా అతడి పెంపుడు శునకం గౌరవ వందనం చేస్తున్నట్లు ఈ ఫొటో ఉంది.
ధోనీ పెట్టిన ఈ ఫొటోకి సోషల్మీడియాలో విపరీతమైన లైక్లు, షేర్లు, కామెంట్లు వస్తున్నాయి. మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆయా జట్లతో పదేళ్ల ఒప్పందం ముగియడంతో వచ్చే ఏడాది ఆటగాళ్లు అందరూ వేలంలో పాల్గొననున్నారు.
ఐపీఎల్ 2018: నిషేధం ముగిసింది, తొలి ప్రాధాన్యత ధోనికే
ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రతినిధి జార్జ్ జాన్ శుక్రవారం మాట్లాడుతూ 'ఒకవేళ నిర్వాహకులు మాకు ఏదైనా అవకాశం ఇచ్చి ఒక ఆటగాడిని జట్టులోనే ఉంచుకోమని అంటే మా మొదటి ప్రాధాన్యత మహేంద్ర సింగ్ ధోనీకే, అతన్నే తీసుకుంటాం' అని పేర్కొన్నాడు. గత రెండు సీజన్లలో ధోనీ రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్కి ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.