హైదరాబాద్: ధర్మశాల వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న చివరి టెస్టులో ఛటేశ్వర్ పుజారా మరో ఘనత సాధించాడు. ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మన్గా సరికొత్త రికార్డు సృష్టించాడు. చివరి టెస్టులో చేసిన అర్ధ సెంచరీ (57)తో పుజారా 2016-17 సీజన్లో 1316 పరుగులు సాధించాడు.
దీంతో గౌతం గంభీర్(1269) పరుగుల రికార్డును పుజారా అధిగమించాడు. 2008-09 సీజన్లో గంభీర్ అత్యధిక పరుగుల్ని నమోదు చేసిన రికార్డును నెలకొల్పాడు. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత ఆ రికార్డును పుజారా బ్రేక్ చేశాడు. కాగా, చివరి టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ కోహ్లీ ఒక సీజన్ అత్యధిక పరుగులు చేసిన స్వదేశీ ఆటగాళ్లలో మూడో స్ధానంలో నిలిచాడు.
ఈ సీజన్లో కోహ్లీ 1252 పరుగులు నమోదు చేశాడు. కాగా.. ఓవరాల్గా ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (1483) పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. పుజారా తర్వాత హెడెన్ (1287), గంభీర్ (1269), బ్రియాన్ లారా(1253)లు ఉన్నారు.
కాగా, రాంచీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత ఆటగాడు చటేశ్వర పుజారా ఒక ఇన్నింగ్స్లో అత్యధిక బంతులను ఆడిన స్వదేశీ ఆటగాడి రికార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 525 బంతులు ఆడిన పుజారా.. రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న 495 బంతుల రికార్డును అధిగమించాడు.