హైదరాబాద్: అత్యుత్తమ టెస్టు బ్యాట్స్మెన్లలో ఛటేశ్వర్ పుజారా ఒకడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పుజారా సెంచరీతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టెస్టు మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. 'మిడిల్ ఆర్డర్లో పుజారా, రహానే ఇద్దరూ అత్యుత్తమ టెస్టు బ్యాట్స్మెన్లు. ఈ మధ్య కాలంలో నిలకడగా రాణిస్తున్నారు. ఇక పుజారా విషయానికి వస్తే అతని పరుగుల దాహం, అతని మానసిక సామర్థ్యం అతన్ని గొప్ప బ్యాట్స్మన్గా నిలబెట్టాయి' అని కోహ్లీ కితాబిచ్చాడు.
'నేను పూజారాకే ఎక్కువ క్రెడిట్ ఇస్తాను. టీమిండియా తరఫున కేవలం ఒక ఫార్మెట్లోనే అతను ఆడుతున్నాడు. అయినా, ఎంతో పరుగుల దాహంతో ప్రతిసారి రాణిస్తున్నాడు. ఎంతో అకుంఠిత దీక్ష, మానసిక సామర్థ్యం ఉంటే తప్ప ఇలా నిలకడగా రాణించడం సాధ్యం కాదు' అని కోహ్లీ అన్నాడు.
కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 133 పరుగులు చేసిన పూజారా... రహానే (132)తో కలిసి 217 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 622/9 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక 183 పరుగులకే ఆలౌటైంది.
దీంతో ఫాలో ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్లో కూడా 386 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆతిథ్య శ్రీలంకపై ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కోహ్లీసేన కైవసం చేసుకుంది.