హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా ఈ ఏడాది జూన్లో మొదలయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ప్రాతినిధ్యంపై ఇంకా సందిగ్ధత ఇంకా వీడటం లేదు. ఆదాయ పంపిణీ విషయంలో ఐసీసీతో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలగడంపై బీసీసీఐ తర్జనభర్జన పడుతున్న సంగతి తెలిసిందే.
దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే విషయంలో బోర్డు ఆఫీస్ బేరర్లు తమ అనుమతి లేకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సీఓఏ స్పష్టం చేసింది. ఆదాయ పంపిణీ, చాంపియన్స్ ట్రోఫీ తదితర అంశాలపై చర్చించేందుకు ఈ నెల 7న బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో ఛాంపియన్స్ టోర్నీనుంచి తప్పుకోవడం, ఐసీసీ మెంబర్స్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్ (ఎంపీఏ) రద్దు చేసుకోవడంతో పాటు ఐసీసీపై న్యాయపరమైన చర్య తీసుకోవాలని బీసీసీఐలోని అనేక మంది సభ్యులు భావిస్తున్నారు. ఈ విషయమై 30 మంది సభ్యులలో పది మంది ఈ వ్యవహారంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇప్పటికే చర్చించారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు ఆడబోని పరిస్థితి వస్తే మాత్రం ఆ నిర్ణయం బీసీసీఐలో ఉన్న 30 మంది మెంబర్ల ఓటింగ్ సమ్మతితోనే జరగుతుందని ఆయన సూచించారు. దీంతో పాటు బీసీసీఐ అధికారులెవరు తమ అనుమతి లేనిదే ఐసీసీకి ఎటువంటి లీగల్ నోటీసులు పంపడానికి లేదని వినోద్ రాయ్ తెలిపారు.
'ఎస్జీఎంలో ఐసీసీ కొత్త ఆదాయ విధానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని మేం సూచించాం. చాంపియన్స్ ట్రోఫీనుంచి కూడా తప్పుకునే విషయంలో కూడా మా అనుమతి లేకుండా ఏమీ చేయవద్దని చెప్పాం. కొందరు అధికారులు టెలీకాన్ఫరెన్స్లో పాల్గొన్నట్లు, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది' అని వినోద్ రాయ్ అన్నారు.
'ఇలాంటి అంశంపై తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకుంటే వచ్చే ఎనిమిదేళ్ల పాటు భారత్ మరే ఐసీసీ టోర్నీలో కూడా ఆడదని అర్థం. కొంత మంది అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేం. ఓటింగ్ ఉన్న 30 మంది సభ్యులు కూడా ఒకే మాట మీద ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు. ఎందుకంటే ఎంపీఏ అనేది చిన్నపాటి సాదాసీదా ఒప్పందం కాదు' అని సీఓఏ అధినేత వినోద్ రాయ్ స్పష్టం చేశారు.
ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకోవాల్సివస్తే, అది 30 సంఘాల ఏకగ్రీవ నిర్ణయమై ఉండాలని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఎస్జీఎంకు ముందే ఈ నెల 5, 6 తేదీల్లో సీఓఏ సభ్యులు బీసీసీఐతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బీసీసీఐకి ఎప్పుడూ ఆర్థికాంశాలే ముఖ్యం కాదని, క్రికెట్కు తమ తొలి ప్రాధాన్యత అని అభిప్రాయ పడిన బోర్డు సీనియర్ అధికారి ఒకరు... ఇరు పక్షాలకు ఆమోదయోగ్యంగా ఉండే ప్రత్యామ్నాయ మార్గాన్ని తాము వెతుకున్నామని చెప్పారు.