హైదరాబాద్: భారత జట్టు ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశాలు దాదాపుగా లేనట్లే కనిపిస్తున్నాయి. ఒలింపిక్స్లో క్రికెట్ను ప్రవేశపెట్టే అంశంపై బుధవారం జరిగిన బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ) సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగినా సభ్యులు ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు.
త్వరలో జరిగే బోర్డు సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని ఈ భేటీలో తీర్మానించారు. దీంతో మొదటి నుంచి ఒలంపిక్స్లో క్రికెట్ అనే దానిపై వ్యతిరేక భావనతో ఉన్న బీసీసీఐ.. దాన్నే కొనసాగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బోర్డు వర్గాల సమాచారం ప్రకారం... ఒలింపిక్స్లో పాల్గొనకూడదనే తమ ఆలోచనలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఒలింపిక్స్లో ఆడితే బీసీసీఐని జాతీయ క్రీడా సమాఖ్యగా పరిగణిస్తారు. అప్పుడు ఆటగాళ్లు అంతర్జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (వాడా) 'ఎప్పుడు, ఎక్కడ' నిబంధనకు ఒప్పుకోవాల్సి ఉంటుంది.
ఈ నిబంధనను క్రికెటర్లు తీవ్రంగా వ్యతిరేస్తుండటంతో దాన్ని సాకుగా చూపాలని బోర్డు ప్రయత్నిస్తోంది. 'ఒలింపిక్స్లో పాల్గొనాలంటే ఒలింపిక్ చార్టర్ను ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వ పరిధిలోని ఒక జాతీయ క్రీడా సమాఖ్యగా బీసీసీఐ మారిపోవాలి' అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
'దీంతో పాటు నిబంధనల ప్రకారం 'వాడా' పరిధిలోకి క్రికెటర్లు కూడా రావాలి. దీనికి మన క్రికెటర్లు కూడా వ్యతిరేకం. ఇలాంటి సమస్యల మధ్య మేం ఒలింపిక్స్లో భాగం కావాలని అనుకోవడం లేదు' ఆయన అన్నారు. చాలా కాలంగా ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్పించేందుకు ఐసీసీ ప్రయత్నం చేస్తున్నా బీసీసీఐ అనాసక్తిగా ఉంది.
ఇదిలా ఉంటే ఆసియా క్రీడల్లో క్రికెట్ ఉన్నా బీసీసీఐ తమ జట్టును పంపించడం లేదు. ఒక్క 1998 కామన్వెల్త్ క్రీడలకు మాత్రం టీమిండియాను పంపింది.