హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన ఘనతను సాధించాడు. శుక్రవారం ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. ఈ మధ్య కాలంలో డేవిడ్ వార్నర్ అద్భతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు. కాగా, ఐసీసీ వన్డే ర్యాంకుల్లో డేవిడ్ వార్నర్ నెంబర్ వన్ స్ధానాన్ని దక్కించుకోవడం ఇదే తొలిసారి.
ఐదో వన్డే: కోహ్లీ తర్వాత పాక్పై వార్నర్ రికార్డుల మోత
రెండో స్ధానంలో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ ఉండగా, మూడో స్ధానాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దక్కించుకున్నాడు. పాకిస్థాన్తో ముగిసిన ఐదు మ్యాచ్ల వన్డే సిరిస్లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 367 పరుగులు చేయడంతో నెంబర్ వన్ స్ధానాన్ని సొంతం చేసుకున్నాడు.
వార్నర్ విజృంభణతో స్వదేశంలో పాకిస్థాన్పై జరిగిన ఐదు వన్డేల సిరస్ను 4-1తేడాతో ఆసీస్ కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 369 పరుగులు సాధించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, హెడ్లు తొలివికెట్కు 284 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇది ఆస్ట్రేలియా చరిత్రలోనే సరికొత్త రికార్డు. అంతేకాదు ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో ఏ వికెట్కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. డేవిడ్ వార్నర్కు ఇది 13వ సెంచరీ. మరో ఓపెనర్ ట్రావిడ్ హెడ్ 137 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 128 పరుగులు నమోదు చేశాడు. హెడ్కు ఇద తొలి సెంచరీ కావడం విశేషం.
అనంతరం 370 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 49.1 ఓవర్లలో 312 పరుగులకు ఆలౌటైంది. ఇక అడిలైడ్ వన్డేలో ఆస్ట్రేలియాపై 100 పరుగులు చేసిన బాబర్ అజమ్ ఐదు స్ధానాలు ఎగబాకి తొలిసారి టాప్ టెన్లో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరిస్లో అజమ్ బాబర్ మొత్తం 282 పరుగులు సాధించాడు.
పాక్కు చెందిన మరో ఆటగాడు షర్జీల్ ఖాన్ ఈ సిరిస్లో 250 పరుగులు చేశాడు. దీంతో 35 స్ధానాలు ఎగబాకి 53వ స్ధానంలో నిలిచాడు. ఇక భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముగిసిన వన్డే సిరిస్లో మూడు అర్ధసెంచరీలు సాధించిన ఇంగ్లాండ్ ఆటగాడు జాసన్ రాయ్ 23 స్ధానాలు ఎగబాకి కెరీర్లోనే తొలిసారి టాప్ 20 అంటే 17వ స్ధానంలో నిలిచాడు.
BREAKING: @davidwarner31 reaches number 1 for the first time in the MRF Tyres ODI Player Rankings: https://t.co/Y8COtFV1S4 pic.twitter.com/APfOa7fq2n
— ICC (@ICC) 27 January 2017
మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఒక స్థానాన్ని మెరగుపరచుకొని 13వ ర్యాంకుకు ఎగబాకాడు. గాయంతో గత కొంతకాలంగా క్రికెట్కు దూరమైన రోహిత్ శర్మ మూడు ర్యాంకులు కోల్పోయి 12వ స్థానానికి పడిపోయాడు. భారత ఓపెనర్ శిఖర్ ధావన్, ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ సంయుక్తంగా 14వ ర్యాంకును సంపాదించుకున్నాడు.
బౌలింగ్ విభాగంలో టీమిండియాకు చెందిన ఏ ఒక్క బౌలర్ టాప్ 10లో చోటు దక్కించుకోలేకపోయారు. అక్షర్పటేల్ ఒక్కడే 12వ స్థానంలో నిలిచాడు. అమిత్మిశ్రా 14, అశ్విన్ 19 ర్యాంకుల్లో ఉన్నారు. జట్టు ర్యాంకింగ్స్లో టీమిండియా మూడో ర్యాంకులోనే కొనసాగుతోంది.