హైదరాబాద్: రాబోయే ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్ హెడ్ కోచ్గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జాసన్ గిలెస్పీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీ యాజమాన్యం అతడితో చర్చలు జరుపుతోంది.
అండర్-19, భారత్-ఏ కోచ్గా రాహుల్ ద్రవిడ్తో బీసీసీఐ రెండేళ్ల పాటు ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో ఢిల్లీ కోచ్ పదవికి ద్రవిడ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ద్రవిడ్ రాజీనామా నేపథ్యంలో హెడ్ కోచ్ పదవికి గిలెస్పీని తీసుకోవాలని ఢిల్లీ ఫ్రాంచైజీ యాజమాన్యం భావిస్తోంది.
ఆస్ట్రేలియాకు చెందిన జాసన్ గిలెస్పీ ప్రస్తుతం బిగ్బాష్ లీగ్లో అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రధాన కోచ్గా ఉన్నాడు. ఇంగ్లిష్ కౌంటీ యార్క్షైర్ కూడా గిలెస్పీని మరోసారి కోచ్గా తీసుకోవాలని యోచిస్తోంది. అతడి ట్రయినింగ్లోనే ఆ జట్టు వరుసగా రెండుసార్లు కౌంటీ ఛాంపియన్షిప్ టైటిళ్లు సాధించింది.
42 ఏళ్ల జాసన్ గిలెస్పీ ఆస్ట్రేలియా తరుపున 71 టెస్టులు, 97 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 259 వికెట్లు తీసుకోగా, వన్డేల్లో 142 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో గిలెస్పీ అనుభవం తమ జట్టుకు లాభిస్తుందని ఢిల్లీ యోచిస్తోంది. అతనితో చర్చలు జరుపుతున్నట్టు ఢిల్లీ యాజమాన్యం సూచనప్రాయంగా వెల్లడించింది.