హైదరాబాద్: ఆధార్ వివరాలను అప్డేట్ చేసే కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ) అత్యుత్సాహం ప్రదర్శించింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల తన ఆధార్ సమాచారాన్ని అప్ డేట్ చేసుకున్నాడు. దీని కోసం కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ) సేవలను ధోని ఉపయోగించుకున్నాడు.
'రాంచీలోని సీఎస్సీలో ధోనీ, ఆయన కుటుంబసభ్యులు ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకున్నారు' అంటూ ధోనీ ఫొటోను, ఆధార్ కార్డు దరఖాస్తును సీఎస్సీ ట్విటర్లో పోస్టు చేసింది. దీనిపై ధోనీ సతీమణి సాక్షిసింగ్ మండిపడ్డారు. వ్యక్తిగత వివరాలను అనుమతి లేకుండా ఎలా బయటపెడతారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ను ట్యాగ్ చేస్తూ తమ వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగపరిచే అధికారం ఎవరిచ్చారంటూ ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంటనే స్పందించారు. తాను పెట్టిన ఫొటోలో వ్యక్తిగత సమాచారం ఏముందని ఆయన ప్రశ్నించారు.
అయితే, సీఎస్సీ చేసిన ట్వీట్లో ధోనీ దరఖాస్తు ఉన్న విషయాన్ని స్క్రీన్ షాట్ తీసి కేంద్ర మంత్రికి సాక్షి పంపించారు. దీంతో, జరిగిన తప్పును ఆయన గ్రహించారు. జరిగిన దానిపై చర్యలు తీసుకుంటామని సాక్షికి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని తమ దృష్టికి తెచ్చినందుకు సాక్షికి ధన్యవాదాలు తెలిపారు.
'ఆధార్ కార్డు వివరాలు, దరఖాస్తు ఏమైనా పబ్లిక్ ప్రాపర్టీనా? గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదా?' అంటూ సాక్షి మరో ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు.
'వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం చట్టరీత్యానేరం. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని' ఆయన హామీ ఇచ్చారు. తనకు సరైన సమాధానం ఇచ్చినందుకు కేంద్ర మంత్రికి సాక్షి థ్యాంక్స్ తెలిపారు. కొద్దిసేపటి తర్వాత సీఎస్సీ సెంటర్ ఆ ట్వీట్ను డిలీట్ చేసింది