న్యూఢిల్లీ: ఐదు టెస్టుల సిరిస్ కోసం ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చి 18 రోజులు పూర్తయ్యాయి. అయినా ఇంగ్లాండ్ క్రికెటర్లెవరూ బీసీసీఐ నుంచి తమ రోజువారీ భత్యాలను అందుకోలేదు. దినసరి భత్యాల కోసం ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నారు.
రెండో టెస్టు, డే 4: భారత్వైపే మొగ్గు, ఇంగ్లాండ్ 87/2
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య సిరిస్కు సంబంధించి రెండు బోర్డుల మధ్య ఇంకా ఎంఓయూపై సంతకం చేయకపోడవమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ఎంఓయూలోనే రోజువారీ భత్యాల వివరాలు ఉంటాయి. భారత పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఒక్కొక్కరికి బీసీసీఐ రోజుకు 50 పౌండ్లు (రూ. 4200) చెల్లించాలి.
కానీ సుప్రీం కోర్టు తీర్పు కారణంగా బీసీసీఐ, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎంఓయూపై సంతకాలు చేయలేదు. దీంతో ఆటగాళ్ల రోజువారీ భత్యాలను బీసీసీఐ ఇంకా చెల్లింలేదు. మరోవైపు తొలి మూడు టెస్టుల నిర్వహణ కోసం సుప్రీంకోర్టు ఒక్కో మ్యాచ్లకు దాదాపు రూ.58.6 లక్షలు మంజూరు చేసింది.
నిజానికి రోజువారీ భత్యాలు ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద సమస్యే కాదు. కానీ.. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పరోక్షంగా ఇంగ్లాండ్ జట్టుపై కూడా ప్రభావం చూపింది. ఇంగ్లాండ్ జట్టు వద్ద ఉన్న ఇండియన్ కరెన్సీ అయిపోయాయి. మరోవైపు టెస్టు మ్యాచ్ అధికారులు, భారత అటగాళ్లు మాత్రం భత్యాలు పొందుతున్నట్లు తెలుస్తోంది.
లోధా కమిటీ సిఫారసుల అమలు విషయంలో బీసీసీఐ వైఖరిని తప్పుబట్టిన సుప్రీం కోర్టు రాష్ట్ర సంఘాలకు నిధులు విడుదల చేయడానికి వీల్లేదని బీసీసీఐని ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం తాము అవగాహన ఒప్పందం కుదుర్చుకోలేని స్థితిలో ఉన్నామని బీసీసీఐ కార్యదర్శి షిర్కే ఇంతకుముందు ఈసీబీ మేనేజర్కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్ జట్టు ఖర్చులను ఈసీబీ భరించాలని లేఖలో షిర్కే విజ్ఞప్తి చేశాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్ల రోజువారీ భత్యాల విషయంపై షిర్కే రాసిన లేఖకు ఈసీబీ కూడా స్పందించింది. టెస్టు సిరీస్ రద్దు అవుతుందని బోర్డు ఆందోళన వ్యక్తం చేయడంతో ఒక్కో మ్యాచ్కు రూ. 58.6 లక్షల చొప్పున తొలి మూడు టెస్టులకు విడుదల చేయొచ్చని సుప్రీం కోర్టు మంజూరు చేసింది.