అసలేం జరిగిందంటే?
శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న అర్జున రణతుంగ 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ ఆరోపించాడు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని అర్జున డిమాండ్ చేశాడు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఆ ఫైనల్లో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఓడిపోవడం తనను విస్మయపరిచిందని ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో అతడు పేర్కొన్నాడు.
సంగక్కర సమతూకంగా ఎంచుకోలేదు
ఫైనల్ జట్టుని అప్పటి కెప్టెన్ కుమార సంగక్కర సమతూకంగా ఎంచుకోలేదని.. తుది జట్టులో ఏకంగా నాలుగు మార్పులు చేయడం తనకి ఆశ్చర్యం కలిగించిందని రణతుంగ వెల్లడించాడు. త్వరలో పక్కా సాక్ష్యాలు వెల్లడిస్తానని రణతుంగ చెప్పాడు. భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్కి రణతుంగ కామెంటేటర్గా వ్యవహరించాడు.
అప్పుడు నేను భారత్లోనే ఉన్నాను
‘ఆ రోజు నేను భారత్లోనే ఉన్నాను. ఫైనల్లో శ్రీలంక ఓడిన తీరు నాకు చాలా బాధ కలిగించింది. తుది జట్టు ఎంపికపై నాకు చాలా అనుమానాలున్నాయి. అన్నీ ఆధారాలతో త్వరలోనే బయటపెడతా. కచ్చితంగా ఆ ఫైనల్పై విచారణ జరగాల్సిందే' అని రణతుంగ శుక్రవారం అన్నాడు. 2011 వరల్డ్ కప్ భారత్లోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగింది.
28 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఆ తర్వాత 275 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 28 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ని మళ్లీ చేజిక్కించుకుంది.
ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు
టోర్నీలో అప్పటి వరకు మెరుగ్గా రాణించిన మాథ్యూస్, హెరాత్, అజంతా మెండిస్, చమర సిల్వ స్థానంలో ఫైనల్ మ్యాచ్కి తిసారా పెరీరా, సురాజ్ రణదీవ్, కులశేఖర, కపుగెదరను కెప్టెన్ సంగక్కర తుది జట్టులోకి తీసుకున్నాడు. అయితే 2011 వరల్డ్ కప్ పైనల్ మ్యాచ్పై రణతుంగ ఇలాంటి ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి కాదు.