హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతం గంభీర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఢిల్లీ రంజీ జట్టు కెప్టెన్సీ పదవి నుంచి వైదొలిగాడు. గత నాలుగేళ్లుగా ఢిల్లీ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న గంభీర్ తన పదవికి రాజీనామా చేశాడు. అయితే జట్టులో సభ్యుడిగా మాత్రం కొనసాగుతానని చెప్పాడు.
ఈ మేరకు ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీసీ) అడ్మినిస్ట్రేటర్ విక్రమ్ జిత్కు లేఖ రాశారు. తన కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పే సమయం ఆసన్నమైందని లేఖలో స్పష్టం చేసిన గంభీర్, మరొకరి ఆ బాధ్యతను అప్పజెప్పాలని సూచించాడు. జట్టుకు ఆటగాడిగా సేవలందిస్తానని గంభీర్ పేర్కొన్నాడు.
దీంతో అతని స్థానంలో ఇషాంత్ శర్మను ఢిల్లీ రంజీ కెప్టెన్గా నియమిస్తూ డీడీసీఏ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే గతంలో విజయ్ హజారే ట్రోఫీ సీజన్లో గంభీర్ స్థానంలో రిషబ్ పంత్ను ఢిల్లీ కెప్టెన్గా నియమించిన సంగతి తెలింసిందే. ఈ ట్రోఫీ సందర్భంగా ఢిల్లీ కోచ్ కేపీ భాస్కర్ను గంభీర్ దూషించాడు.
కోచ్ తప్పుడు నిర్ణయాల వల్లే ఢిల్లీ జట్టు పేలవ ప్రదర్శన చేసిందని గంభీర్ అప్పట్లో మండిపడ్డాడు. అంతేకాదు కోచ్ని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో గంభీర్పై నాలుగు మ్యాచ్ల నిషేధం పడింది. అప్పట్నుంచి డీడీసీఏతో సఖ్యత కోల్పోయిన గంభీర్ శనివారం కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.