హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా చివరిదైన మూడో టెస్టు భారత్-శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 12 (శనివారం) ప్రారంభం కానుంది. మూడో టెస్టులో భారత తుది జట్టులో చోటు దక్కితే అది తనకు దక్కే బహుమానంగా భావిస్తానని భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అభిప్రాయపడ్డాడు.
'నా తొలి టెస్టు అరంగేట్రం అప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నానో ఇప్పుడూ అలానే ఉన్నాను. ఒక వేళ నాకు అవకాశం వస్తే చాలా సంతోషిస్తా. ఎందుకంటే అది నా కష్టానికి ప్రతిఫలం. చక్కని ప్రదర్శన చేయాలి కాబట్టి కాస్త బెరుగ్గానూ ఉంది. అయితే నా ఎంపికపై స్పష్టత లేదు. ఇక్కడికి వచ్చినప్పట్నుంచి కోచ్ రవిశాస్త్రి సర్ నన్ను బాగా ప్రోత్సహిస్తున్నాడు' అని కుల్దీప్ అన్నాడు.
'నెట్స్లో బాగా సాధన చేస్తున్నాను. టెస్టులు ఆడటం నాకల. దానికోసం ఎన్నో రాత్రులు నిద్రలేక గడిపాను. జట్టులో జడేజా, అశ్విన్లు ఉన్నప్పుడు చోటు కోసం ఎదురుచూడక తప్పదు. వారికి సన్నిహితంగా ఉంటూ మెలకువలు నేర్చుకుంటాను. బౌలింగ్ కోచ్ శ్రీధర్తో నాకు పదేళ్ల నుంచి సాన్నిహిత్యం ఉంది. అండర్-16, అండర్-19 క్రికెట్ను ఆయన శిక్షణలో ఆడా' అని కుల్దీప్ అన్నాడు.
మూడో టెస్టుకు రవీంద్ర జడేజాపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో జడేజా స్ధానంలో జట్టులోకి వచ్చిన యువ బౌలర్ అక్సర్ పటేల్తో ఈ చైనామన్కు పోటీ నెలకొంది. తుది పదకొండు మందిలో స్థానం కోసం అక్షర్, కుల్దీప్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఈ సిరిస్ ప్రారంభం నుంచి కుల్దీప్ జట్టుతోనే కలిసి ఉన్నాడు.
ఇదే అతడికి కలిసొచ్చే అంశంగా క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మూడో టెస్టులో ముగ్గురు స్పిన్నర్లతో భారత జట్టు బరిలోకి దిగితే ఈ ఇద్దరికి అవకాశం దక్కుతుంది. ఇదిలా ఉంటే తన అరంగేట్రం టెస్టులో కుల్దీప్ అద్భుత ప్రదర్శన చేశాడు. ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 4/68 తో రాణించి సిరీస్ (2-1) విజయంలో కీలక పాత్ర పోషించాడు.