హైదరాబాద్: రాంచీలోని జేఎస్సీఏ స్టేడియంలో భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో మ్యాక్స్వెల్ తొలి టెస్టు సెంచరీ చేయడంతో అరుదైన ఘనతను సాధించాడు. 99వ ఓవర్లో చివరి బంతిని ఫోర్గా మలిచి మ్యాక్స్వెల్ వంద పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. మ్యాక్స్వెల్కు ఇది తొలి టెస్టు సెంచరీ.
నా కండ బలం చూశావా: విరిగిన బ్యాట్పై మ్యాక్సీతో ఉమేశ్ యాదవ్ (వీడియో)
దీంతో ఆస్ట్రేలియా తరుపున టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా మ్యాక్స్వెల్ రికార్డు సృష్టించాడు. అంతకముందు ఆసీస్ తరుపున మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా షేన్ వాట్సన్ గుర్తింపు పొందాడు. రాంచీ టెస్టులో సెంచరీ సాధించడంతో మూడు ఫార్మాట్లలో ఆసీస్ తరపున సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా మాక్స్వెల్ రికార్డు సృష్టించాడు.
మ్యాక్స్వెల్ 2015 మార్చిలో శ్రీలంకపై వన్డేల్లో 102 పరుగులు సాధించాడు. ఆ తర్వాత 2016లో అదే శ్రీలంకపై సెప్టెంబరులో టీ20ల్లో 145 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ప్రస్తుతం రాంచీలో భారత్తో జరుగుతున్న ముూడో టెస్టులో సెంచరీని సాధించాడు. తాను అరంగేట్రం చేసిన దేశంపైనే మ్యాక్స్వెల్ టెస్టుల్లో తొలి సెంచరీ చేయడం విశేషం.
2013లో భారత్పై హైదరాబాద్లో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఈ ఫార్మాట్లో మ్యాక్స్వెల్ అరంగేట్రం చేశాడు. సెంచరీ చేసిన కొద్దిసేపటికే అతడు అవుటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోని క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విటర్లో అభిమానుల కోసం పోస్టు చేసింది. మ్యాక్స్వెల్ తన కెరీర్లో ఆడుతోన్న నాలుగో టెస్టు ఇది. దీనికి ముందు టెస్టుల్లో మ్యాక్స్వెల్ అత్యధిక స్కోరు 37గా ఉంది.