గ్రేడ్ల ప్రకారం కాంట్రాక్ట్ ప్లేయర్లకు జీతాలు చెల్లిస్తోన్న బీసీసీఐ
గ్రేడ్ల ప్రకారం బీసీసీఐ కాంట్రాక్ట్ ప్లేయర్లకు చెల్లించేది రూ. 2 కోట్లు, రూ. కోటి, రూ. 50 లక్షలు. అయితే.. టెస్ట్ మ్యాచ్ ఆడిన వారికి మ్యాచ్ ఫీజు రూ. 15 లక్షలు చెల్లిస్తుంటే.. ఫస్ట్క్లాస్ మ్యాచ్ (రంజీ, దులీప్ ట్రోఫీ) ఆడినందుకు దేశవాళీ ప్లేయర్ల మ్యాచ్ ఫీజు కింద రూ. 1.5 లక్షలు చెల్లిస్తున్నారు.
కుంబ్లేకు రాసిన లేఖలో భజ్జీ ఆవేదన
ఈ నేపథ్యంలో దేశవాళీ ఆటగాళ్లు ఆర్థికంగా ఎంతటి అభద్రతా భావానికి లోనవుతున్నారో హర్భజన్ తన లేఖలో కుంబ్లేకి వివరించాడు. 'రెండు మూడేళ్లుగా రంజీలు ఆడుతున్నా. ఈ సమయంలో నాతోటి ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆటగాళ్ల ఆర్థిక ఇబ్బందులను చూసి చలించిపోయాను. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయాన్ని అర్జిస్తున్న క్రికెట్ బోర్డు ఈ ట్రోఫీ నిర్వహిస్తున్నా ఇలాంటి పరిస్థితి ఉండడం దారుణం. 2004 నుంచి వీరి ఫీజులో మార్పులు కూడా జరగలేదు. అప్పటి వందకు ఇప్పటి వంద రూపాయలకు తేడా ఎంతో మారింది. ఏడాదికి ఎంత సంపాదిస్తామో కూడా తెలీకుండా వారు జీవితంలో ఎలాంటి ప్రణాళికలు వేసుకోగలరు? దయచేసి ఈ అసమానతను బీసీసీఐతో పాటు సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, సెహ్వాగ్ లాంటి వారి దృష్టికి కూడా తీసుకెళ్లి.. జీతాలు పెంచే విషయమై కృషి చేయాలని కోరుతున్నాను' అని కుంబ్లేకు రాసిన లేఖలో భజ్జీ ఆవేదన చెందాడు.
ఐపీఎల్ పుణ్యమా అని కోట్లు సంపాదిస్తున్నా సగటు ఆటగాడు
రంజీ ఆటగాళ్లలో కొంతమంది ఐపీఎల్ పుణ్యమా అని కోట్లు సంపాదిస్తున్నా సగటు ఆటగాడు మాత్రం ఫస్ట్ క్లాస్ క్రికెట్ (రంజీ, దులీప్ ట్రోఫీ)లో మ్యాచ్ ఫీజు కింద లక్షన్నర పొందుతున్నాడు. వందల్లో ఉన్న ఆటగాళ్లలో చాలా కొద్దిమందికే ఐపీఎల్ కాంట్రాక్ట్ లభిస్తోందని, అయితే వారు కూడా ప్రొఫెషనల్ ఆటగాళ్లే అని ఈ సందర్భంగా భజ్జీ గుర్తుచేశాడు.
సునీల్ గావస్కర్ సైతం ఇదే అభిప్రాయం
మరోవైపు మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ సునీల్ గావస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఏడాదిలో 81 రోజులపాటు మ్యాచ్లు ఆడే దేశవాళీ ఆటగాళ్లు దాదాపు రూ.40 లక్షల వరకు మాత్రమే సంపాదించగలరని, అదే ఓ అనామక ఆటగాడు ఐపీఎల్లో ఆడే 16 మ్యాచ్ల్లోనే దాదాపు రూ.4 కోట్ల వరకు వెనకేసుకుంటాడని పేర్కొన్నాడు. బీసీసీఐకి డబ్బు సంపాదించి పెడుతోంది ఆటగాళ్లే కాబట్టి వారు ఎక్కువ కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని సునీల్ గవాస్కర్ స్పష్టం చేశారు.