హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ఆగస్టు 12 (శనివారం) పల్లెకెలె వేదికగా ప్రారంభం కానుంది. ఈ టెస్టుకు శ్రీలంక వెటరన్ స్పిన్నర్ రంగనా హెరాత్ దూరం కానున్నాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
గత మూడు వారాలుగా రంగనా హెరాత్ విశ్రాంతి లేకుండా క్రికెట్ ఆడుతుండటంతో శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అంతకుముందు శ్రీలంక ప్రధాన పేసర్ నువాన్ ప్రదీప్ గాయం కారణంగా టెస్టు సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే.
హెరాత్కు ఎటువంటి గాయం అవలేదని, గత మూడు వారాల నుంచి అధిక వర్క్లోడ్ కారణంగా అతడికి మూడో టెస్టులో విశ్రాంతిని కల్పించామని శ్రీలంక క్రికెట్ మేనేజర్ అసాంక గురుసిన్హా తెలిపారు. జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టులో హెరాత్ 71.1 ఓవర్లు బౌలింగ్ చేశాడు.
ఆ తర్వాత భారత్తో జరిగిన రెండు టెస్టుల్లో 91 ఓవర్ల పాటు బౌలింగ్ చేశాడు. ఇలా వరుసగా మూడు టెస్టుల్లో సుమారుగా 200 ఓవర్లు బౌలింగ్ చేయడంతో హెరాత్పై విపరీతమైన భారం పడింది. అతడి వయసుని దృష్టిలో పెట్టుకుని విశ్రాంతినిచ్చామని అసాంక గురుసిన్హా తెలిపారు.
మరోవైపు రాబోయే రెండు నెలల్లో పాకిస్థాన్తో శ్రీలంక టెస్టు సిరిస్ను ఆడనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం సరైందేనని చెప్పాడు. మూడు టెస్టుల సిరిస్లో ఇప్పటికే రెండు టెస్టులను కోల్పోయిన లంక జట్టు మూడో టెస్టులో కనీసం పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.
మరోవైపు వరుసగా కీలక ఆటగాళ్లు దూరం కావడం జట్టును మరింత ఇబ్బందులోకి నెడుతోంది. భారత్తో టెస్టు సిరీస్ ఆరంభమైన నాటి నుంచి చూస్తే అసేలా గుణరత్నే, ప్రదీప్, సురంగా లక్మల్లు దూరమయ్యారు. తాజాగా ఇప్పుడు హెరాత్కు బోర్టు విశ్రాంతినిచ్చింది.