హైదరాబాద్: ఫిబ్రవరి 13న భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే ఏకైక టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వలేమంటూ వచ్చిన వార్తలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఖండించింది. బంగ్లాదేశ్తో జరిగే టెస్టుకు ఉప్పల్ వేదికగా నిలుస్తుందని హైదరాబాద్ క్రికెట్ సంఘం కార్యదర్శి జాన్ మనోజ్ స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్తో జరిగే టెస్టును హైదరాబాద్ నిర్వహించడం లేదని వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. టెస్టును నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గతంలో కూడా నగరంలో టెస్టు మ్యాచ్లు నిర్వహించడానికి వెనకడుగు వేయలేదని విషయాన్ని గుర్తించు కోవాలని అన్నాడు.
'టెస్టు మ్యాచ్ నిర్వహణలో భాగంగా స్టేడియం ప్రకటనలకు సంబంధించి టెండర్ నోటీసును కూడా జారీ చేశాం. మ్యాచ్కు సంబంధించి ట్వెంటీ ఫస్ట్ సెంచరీ మీడియాతో ఒప్పందం కూడా ఒకటి రెండు రోజుల్లో జరుగుతుంది. మ్యాచ్ను నిర్వహించడం లేదనే రూమర్లు ఎక్కడ్నుంచి వచ్చాయో తెలియడం లేదు' అని ఆయన తెలిపారు.
బంగ్లాదేశ్ జట్టు హైదరాబాద్ వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వార్మప్ మ్యాచ్కు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్కు ముందు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి హైదరాబాద్లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగనుంది.
అంతకముందు బంగ్లాదేశ్తో జరగనున్న ఏకైక టెస్ట్ మ్యాచ్కు ఆతిథ్యమివ్వడం తమ వల్ల కాదని బీసీసీఐకి హెచ్సీఏ తేల్చి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే నిధుల కొరత కారణంగా ఈ మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదని హెచ్సీఏ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు వచ్చే నెలలో జరగాల్సిన రెండు అండర్ 19 టెస్ట్ మ్యాచ్లను తాము నిర్వహించలేమని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్సీఏ) చెప్పింది. భారత్ అండర్ 19 జట్టు ఇంగ్లాండ్తో ఐదు వన్డేలు, రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. వన్డేలు ముంబైలో జరుగుతుండగా టెస్టులను చెన్నైకి కేటాయించారు.