ముంబై: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత కూడా ఆటలో భాగంగా మొదలైన వివాదాస్పద వ్యాఖ్యల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు సహా, ఆసీస్ మీడియా సైతం టీమిండియాపై విమర్శలు గుప్పించింది.
తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఎడ్ కోవెన్ భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. భారత్తో తాను ఆడిన ఓ సిరీస్ను గుర్తుకు తెచ్చుకుని.. ఆ మ్యాచ్లో కోహ్లీ తనను నిందిస్తుంటే ఏమంటున్నాడో అర్థం కాలేదని, అతని భావం తెలుసుకుని ఓ స్టంపును పీకి అతన్ని పొడుద్దామనుకున్నానని 'ఫాక్స్ స్పోర్ట్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.
కోహ్లీ మాటలు అప్పట్లో తనకు ఎంతమాత్రమూ అర్థం కాలేదన్నాడు. తమ మధ్య జరుగుతున్న గొడవను సర్దేందుకు అంపైర్లు కల్పించుకున్నారని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు కోహ్లీ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని చెప్పాడు. అయితే, ఇద్దరి మధ్య వివాదం ఎప్పుడు జరిగిందనే దానిపై కోవాన్ స్పష్టత ఇవ్వలేదు.
కోవాన్ తన టెస్ట్ కెరీర్లో 18 మ్యాచులు ఆడాడు. అందులో ఒకే ఒక్క సెంచరీ ఉంది. అతని బెస్ట్ 136. 2011లో మెల్బోర్న్లో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా ఈ ఫార్మాట్లో కోవాన్ ఆరంగేట్రం చేశాడు. 2013లో ఆసిస్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఆసిస్ జట్టు నుంచి వీడ్కోలు తీసుకున్నాడు.