హైదరాబాద్: పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడే విషయంలో టీమిండియాను బలవంతం చేయలేమని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ అన్నారు. లాహోర్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే పాకిస్థాన్లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరగడానికి మాత్రం తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.
పాకిస్థాన్ కంటే ఇండియా క్రికెట్ వైపే ఐసీసీ ఎక్కువ మొగ్గు చూపుతుందనే ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. అన్ని సభ్య దేశాల మధ్య సన్నిహిత సంబధాలు ఉండాలనే తాము కోరుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇక భారత్-పాక్ జట్ల మధ్య దైపాక్షిక సిరీస్ల విషయంలో తమ జోక్యం నామమాత్రమేనని రిచర్డ్సన్ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని... ఇరు దేశాల సంబంధాలపైనే క్రికెట్ ఆధారపడి ఉంటుందని తెలిపారు. 'పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్ విషయంలో టీమిండియాను బలవంతం చేయలేము. పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడటానికి భారత జట్టు ముందుకు రాకపోతే వారిని మేము హెచ్చరించలేం. దైపాక్షిక సిరీస్ ఒప్పందం అనేది ఇరు క్రికెట్ బోర్డులకు సంబంధించింది' అని ఆయన తెలిపారు.
'ఆ నేపథ్యంలో భారత్తో ద్వైపాకిక్ష సిరీస్ల పై మేము ఏమీ మాట్లడలేం. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగడం లేదు. దీనిపై మా జోక్యం అంతంత మాత్రమే. కాకపోతే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు అనవసర రాద్దాంతాన్ని సృష్టిస్తే మాత్రం ఐసీసీ సహించదు' అని అన్నారు.
ఇక భారత క్రికెట్ బోర్డును ఐసీసీకి అతి ఎక్కువ మొత్తంలో ఆదాయం సమకూరుతున్నప్పటికీ, తమ దృష్టిల్లో ఐసీసీ హోదా కలిగిన అన్ని క్రికెట్ బోర్డులు ఒకటేననే ఆయన చెప్పుకొచ్చారు. ఇక, వరల్డ్ ఎలెవన్ జట్టులో భారత ఆటగాళ్లు లేని విషయంపై కూడా రిచర్డ్సన్ స్పందించారు. వరల్డ్ ఎలెవన్ జట్టులో భారత ఆటగాళ్లు ఉండుంటే సిరీస్ మరింత విజయవంతం అయ్యేదని చెప్పారు. అయితే, ఇదే సమయంలో భద్రతకు సంబంధించిన టెన్షన్ కూడా ఎక్కువై ఉండేదని ఆయన అన్నారు.