హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అంచనాలు లేకుండా బరిలోకి దిగి బంగ్లాదేశ్ సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాతో 15వ తేదీన బర్మింగ్ హామ్ వేదికగా తలపడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఆ మ్యాచ్లో విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్స్లో అడుగుపెడతామని ఆ జట్టు కెప్టెన్ మొర్తజా తెలిపాడు. టీమిండియాపై తమ జట్టే గెలుస్తుందని ఐసీసీకి ఇచ్చిన ఇంటర్యూలో ధీమా వ్యక్తం చేశాడు.
ఎడ్జిబాస్టన్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో తమపై ఎటువంటి ఒత్తిడిలేదని పేర్కొన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న టీమిండియాపైనే ఒత్తిడి ఉంటుందని చెప్పాడు. ఈ మ్యాచ్లో తాము స్వేచ్ఛగా ఆడి రాణిస్తామని చెప్పాడు.
అంచనాలను పట్టించుకుంటే ప్రతీది భూతద్దంలో చూడాల్సి వస్తుందని, తమపై అంచనాలు లేవు కాబట్టి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఈ మ్యాచ్లో రాణిస్తాని చెప్పాడు. గ్రూప్-ఏ నుంచి సెమీస్కు కచ్చితంగా చేరుతుందని భావించిన ఆసీస్ను అడుగడుగునా వర్షం అడ్డుకోవడంతో ఒక్క విజయం కూడా లేకుండానే ఇంటిదారి పట్టింది.
సెమీస్కు వెళ్లాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లాండ్తో పోటీ పడ్డ మ్యాచ్లో సైతం వరుణుడు అడ్డుకోవడం ఆస్ట్రేలియాకు అశనిపాతమైంది. డక్వర్త్ లూయిస్ పద్ధతిన 40 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ గెలిచినట్టు అంపైర్లు ప్రకటించడంతో ఆస్ట్రేలియా టోర్నీ నుంచి వైదొలిగింది.
ఆస్ట్రేలియా ఓటమితో బంగ్లాదేశ్ సెమీస్కు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-ఏ నుంచి ఇంగ్లాండ్తో పాటు, న్యూజిలాండ్పై చిరస్మరణీయమైన విజయం సాధించిన బంగ్లాదేశ్ సెమీస్కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో సెమీస్లో బంగ్లాదేశ్, టీమిండియాతో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది.