హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియాపై సాధించిన విజయాన్ని వరద బాధితులకు అంకితమిస్తున్నట్లు శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ప్రకటించారు. భారత్పై సాధించిన విజయం తమ దేశ ప్రజల ముఖాల్లో చిరునవ్వులను తెప్పించిందని మ్యాచ్ అనంతరం మాథ్యూస్ చెప్పాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 322 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం 322 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 48.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించింది.
ఛేదనకు దిగిన శ్రీలంకను కట్టడి చేయడంతో బౌలర్లు విఫలమయ్యారు. దీంతో టీమిండియా... శ్రీలంక చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. శ్రీలంకను తేలికగా తీసుకుని టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ అనంతరం మాథ్యూస్ ట్విటర్లో 'వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఈ విజయం అంకితం. ప్రేమ, దీవెనలు అందించిన అందరికీ ధన్యవాదాలు' అని పేర్కొన్నాడు.
మే నెలలో భారీ వర్షాల కారణంగా శ్రీలంకలో 14 జిల్లాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో 200 మంది మృతి చెందగా సుమారు 5 లక్షలపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ సమయంలో రెండు షిప్ల ద్వారా భారత్ శ్రీలంకకు ఆహార పదార్థాలు పంపించిన సంగతి తెలిసిందే.
We dedicate this to everyone affected by https://t.co/PNInuzuCOG u all.Thanks for the love and blessings.big one coming up #greatful
— Angelo Mathews (@Angelo69Mathews) June 8, 2017
టీమిండియాతో జరిగిన మ్యాచ్ని శ్రీలంక కెప్టెన్ మాథ్యూస్ వరల్డ్ కప్ ఫైనల్గా అభివర్ణించాడు. కాగా, ఛాంపియన్స్ టోర్నీలో భాగంగా శ్రీలంక తన తుదపరి మ్యాచ్లో పాకిస్థాన్ను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ని ఉద్దేశించి మాథ్యూస్ 'తరువాత జరగబోయేది బిగ్ మ్యాచ్' అని తెలిపాడు.
లంక చేతిలో ఓటమి పాలవ్వడంతో టీమిండియా సెమీస్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. టోర్నీలో భాగంగా టీమిండియా ఆదివారం (జూన్ 11)న దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. భారత్ తమ చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై నెగ్గితేనే సెమీస్ చేరుతుంది. గ్రూప్ బిలో భాగంగా భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో.. ఇంకో మ్యాచ్ నెగ్గిన రెండు జట్లు సెమీస్ చేరతాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ రసవత్తరంగా మారింది.