హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఘోరంగా ఓటమి పాలవ్వడంపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పాక్ చేతిలో ఓటమి తట్టుకోలేని అభిమానులు హరిద్వార్లో టీవీలు పగలకొట్టి తమ నిరసన వ్యక్తం చేశారు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
చాలా చోట్ల క్రికెటర్ల ప్లెక్సీలను సైతం తగులబెట్టారు. ముఖ్యంగా పాక్ చేతిలో భారత్ దారుణంగా ఓడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాన్పూర్లో అభిమానులు క్రికెటర్ల దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారు. క్రికెటర్లకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
దీంతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా అభిమానులు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో భారత ఆటగాళ్ల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. జార్ఖండ్లోని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నివాసం వద్ద సెక్యూరిటీని పెంచారు.
ఆదివారం ది ఓవల్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చరిత్ర సృష్టించింది. ఏకపక్షంగా సాగిన పోరులో పాక్దే పైచేయి అయింది. పాకిస్తాన్ విసిరిన 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు గాను 158 పరుగులు చేసిన ఆలౌటైంది.
దీంతో భారత్పై 180 పరుగుల తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత బ్యాట్స్మెన్లలో శిఖర్ ధావన్ (21), యువరాజ్ సింగ్ (22), హార్ధిక్ పాండ్యా (76), రవీంద్ర జడేజా (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
చరిత్ర సృష్టించిన పాక్: ఫైనల్లో కోహ్లీ సేనను చిత్తుగా ఓడించింది
పాక్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్, హసన్ అలీ చెరో మూడు వికెట్లు తీయగా షాదాబ్ ఖాన్ రెండు, జునైద్ ఖాన్ ఒక వికెట్ తీశారు. అంతక ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసింది. దీంతో టీమిండియాకు 339 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
పాక్ బ్యాట్స్మెన్లలో పకార్ జామన్ సెంచరీ (114) పరుగులతో చెలరేగగా, అజర్ అలీ 59, బాబర్ ఆజం 46, షోయబ్ మాలిక్ 12, మొహమ్మద్ హఫీజ్ 57, (నాటౌట్), ఇమాద్ వాసిమ్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా, కేదార్ జాదవ్ తలో వికెట్ తీశారు.