హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. సెమీస్కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. దీంతో తుది జట్టులోకి టీమిండియా ప్రధాన స్పిన్నర్ అశ్విన్ను తీసుకోవాలని కెప్టెన్ కోహ్లీకి గంగూలీ సూచన చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ల్లో ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు చోటు దక్కని సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్న ఇంగ్లాండ్లో ఫాస్ట్ పిచ్ల నేపథ్యంలో స్పిన్నర్ అయిన అశ్విన్ను పక్కను పెట్టారు. అయితే ఆదివారం దక్షిణాఫ్రికాతో జరగనున్న కీలక మ్యాచ్లో అశ్విన్కు చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి.
దీంతో రవీంద్ర జడేజాను పక్కన పెడతారా? అనే అనుమానాలు తలెత్తాయి. దీనిపై ఆదివారం గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. 'అశ్విన్తో పాటు రవీంద్ర జడేజా జట్టులో ఉండటం కీలకం. అయితే హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టి అశ్విన్ను తీసుకుని ఐదు బౌలర్ల వ్యూహంతో బరిలోకి దిగితే టీమిండియాకు కలిసొస్తుంది' అని కెప్టెన్ కోహ్లీకి టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సూచించాడు.
'బ్యాటింగ్ గురించి ఎవరికీ ఆందోళన లేదు. లంక మ్యాచ్లో బౌలర్లు తేలిపోవడం వల్లే టీమిండియాకు ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో అశ్విన్ను తీసుకుంటే భారత బౌలింగ్ మరింత పటిష్టమవుతుంది. ప్రధాన మ్యాచ్లలో ఒత్తిడికి గురికావడం సఫారీలకే అలవాటే' అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
మరోవైపు కెప్టెన్ కోహ్లీకి గంగూలీ చేసిన సూచనకు ఆసీస్ మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ కూడా మద్దతు పలికడం విశేషం. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా జట్టులో క్వింటన్ డికాక్, జేపీ డుమిని, డేవిడ్ మిల్లర్ వంటి నాణ్యమైన లెఫ్టాండ్ బ్యాట్స్మెన్ ఉన్నందున ప్రధాన స్పిన్నర్ అశ్విన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి.
ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఆఫ్ బ్రేక్ బౌలింగ్ను ఎదుర్కోవడం కష్టం కనుక అశ్విన్ను ప్రయోగించే అవకాశాలు లేకపోలేదు. దీంతో గత మ్యాచ్లో బంతితో విఫలమైన పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా లేదా ఉమేష్ యాదవ్లలో ఎవరో ఒకరు తప్పుకోవాల్సి ఉంటుంది. కాగా, అదివారం నాటి మ్యాచ్లో అశ్విన్కు చోటు దక్కుతుందని దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ నీల్ మెకన్జీ సైతం అభిప్రాయపడ్డాడు.
తమతో చావో రేవో మ్యాచ్లో అశ్విన్ ఎంపిక కూడా కీలకం కానుందని మెకన్జీ పేర్కొన్నాడు. ఈ మేరకు భారత జట్టు తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలున్నాయని తెలిపాడు. టెస్టుల్లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు స్పిన్ను ఎదుర్కొన లేకపోయినా వన్డేల్లో మాత్రం టీమిండియా స్పిన్నర్లపై అద్భుతంగా ఆడారని గుర్తుచేశాడు. లంక చేతిలో ఓడిన భారత్పై ఒత్తిడి నెలకొన్న తరుణంలో దానిని సద్వినియోగం చేసుకుంటామని చెప్పాడు.