హైదరాబాద్: ఐసీసీ శనివారం ప్రకటించిన వన్డే ర్యాంకుల్లో దక్షిణాఫ్రికా జట్టు నెంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరిస్ను క్లీన్ స్వీప్ చేయడంతో దక్షిణాఫ్రికాకు నెంబర్ వన్ ర్యాంకు లభించింది.
మరోవైపు న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరిస్లో ఆస్ట్రేలియా 0-2 తో ఓటమి పాలవడం దక్షిణాఫ్రికాకు కలిసొచ్చింది. 2014 తర్వాత వన్డే ర్యాంకింగ్స్లో దక్షిణాఫ్రికా నెంబర్ వన్ స్ధానానికి చేరడం ఇదే తొలిసారి. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శ్రీలంకతో చివరి వన్డే సెంచూరియన్లో జరిగింది.
ఈ వన్డే మ్యాచ్లో దక్షిణాఫ్రికా 88 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరిస్ను క్లీన్ స్విప్ చేయడంతో దక్షిణాఫ్రికా జట్టు ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అగ్రస్ధానానికి చేరుకుంది. ఇప్పటివరకు నెంబర్ వన్ ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా రెండో ర్యాంకుకు చేరుకుంది.
శ్రీలంకతో సిరిస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా కంటే దక్షిణాఫ్రికా నాలుగు పాయింట్ల వెనుకబడి ఉంది. ఐదో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 384 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో హషీమ్ ఆమ్లా(154), డీకాక్(109) సెంచరీలు చేశారు.
అనంతరం 385 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 296 పరుగులకే అలౌటైంది. శ్రీలంక ఆటగాళ్లలో గుణరత్నే(114), పతిరానా(56)లు రాణించినా జట్టు ఓటమి నుంచి కాపాడలేకపోయారు. దీంతో శ్రీలంక 88 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
దీంతో ఐదు వన్డేల సిరిస్ ఆడేందుకు దక్షిణాఫ్రికా పర్యటకు వెళ్లిన శ్రీలంక ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకుండా తన పర్యటనను ముగించింది. ఇదిలా ఉంటే ఐసీసీ ప్రకటించిన తాజా వన్డే ర్యాంకుల్లో టీమండియా నాలుగో స్ధానంలో నిలిచింది.
ఐసీసీ వన్డే ర్యాంకులు (ఫిబ్రవరి 10 నాటికి)
(రాంక్, జట్టు, పాయింట్లు)
1. దక్షిణాఫ్రికా 119
2. ఆస్ట్రేలియా 118
3. న్యూజిలాండ్ 113
4. భారతదేశం 112
5. ఇంగ్లండ్ 107
6. శ్రీలంక 98 (-3)
7. బంగ్లాదేశ్ 91
8. పాకిస్థాన్ 89
9. వెస్ట్ ఇండీస్ 87
10. ఆఫ్గనిస్తాన్ 52
11. జింబాబ్వే 47
12. ఐర్లాండ్ 42