హైదరాబాద్: గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరిస్లో బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలకు పాల్పడినందుకు గాను దక్షిణాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్కు ఐసీసీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అయితే తనకు జరిమానా విధించడంపై అప్పీలుకు వెళ్లిన డు ప్లెసిస్కు నిరాశే ఎదురైంది.
నవంబర్ 12 నుంచి 15 వరకు హోబార్డ్ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ 54వ ఓవర్లో బంతిని రబ్ చేయడానికి ముందు డుప్లెసిస్ ఓ తెల్లని పదార్ధాన్ని నోట్లో ఉంచుకుని వేళ్లను చప్పరించాడు. అనంతరం బంతిని రబ్ చేశాడు.
ఆ నిర్ణయం తప్పు: డుప్లెసిస్ సవాల్, ఐసీసీ విచారం
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో హల్చల్ చేయడంతో దీనిపై విచారణకు ఆదేశించి డుప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డాడని తేలడంతో అప్పటి మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వంద శాతం మ్యాచ్ ఫీజులో కోత విధించారు. తనకు జరిమానా విధించడాన్ని ఐసీసీ కమిషన్కు డుప్లెసిస్ అప్పీలు చేసుకున్నాడు.
అయితే దీనిని పరిశీలించిన ఐసీసీ ప్రవర్తనా నియమావళి కమిషన్ చైర్మన్ మైకేల్ బిలాఫ్ అతని అప్పీలును తోసిపుచ్చారు. అంతక ముందు డుప్లెసిస్ అప్పీల్కు వెళ్లడంపై ఐసీసీ విచారం వ్యక్తం చేసింది. 'డుప్లెసిస్ బాల్ టాంపరింగ్కు పాల్పడ్డాడని మ్యాచ్ రిఫరీ ఆండీ పిక్రాఫ్ట్ తేల్చారు. ఈ నిర్ణయాన్ని అంగీకరించని అతను తిరిగి అప్పీల్ చేయనుండడం పట్ల ఐసీసీ అసంతృప్తితో ఉంది. అప్పీల్ చేయడం ఆటగాళ్ల హక్కు కాబట్టి.. త్వరలోనే ఒక విచారణాధికారిని నియమించి ఈ కేసును విచారిస్తాం' అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.
డుప్లెసిస్ అప్పీల్పై ఐసీసీ ప్రవర్తనా నియమావళి కమిషన్ చైర్మన్ మైకేల్ బిలాఫ్ తన సభ్యులతో సమీక్షించారు. చివరకు డుప్లెసిస్ అప్పీల్ను తిరస్కరించారు. మరోవైపు రెండో టెస్టులో తాను బాల్ ట్యాంపరింగ్కు పాల్పడినట్లు ఐసీసీ నిర్ధారించడాన్ని దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ డుప్లెసిస్ తప్పుబట్టాడు. తాను కావాలని ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశాడు.