కొలంబో: అంతర్జాతీయ టెస్టు క్రికెట్కు శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర సోమవారం వీడ్కోలు పలికాడు. ఈ సందర్భంగా మైదానంలో కొన్ని అరుదైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. జట్టు సభ్యులు సంతకాలతో కూడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన జెర్సీని కుమార సంగక్కరకు అందించాడు.
269వ నెంబర్ కలిగిన విరాట్ కోహ్లీ జెర్సీపై టీమిండియా జట్టు ఆటగాళ్ల సంతకాలతో పాటు, సందేశాన్ని కూడా టీమిండియా తరుపున రాశారు. వీడ్కోలు ప్రసంగం అనంతరం జెర్సీని అందుకున్న 37 ఏళ్ల కుమార సంగక్కర టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ధన్యవాదాలు తెలిపాడు.
భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో 13 నెలల తర్వాత టీమిండియా ఓ టెస్టు మ్యాచ్ను గెలిచింది. కెప్టెన్గా విరాట్ కోహ్లీకి ఇది తొలి విజయం. రెండో ఇన్నింగ్స్లో 413 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లక్ష్య ఛేదనలో తడబడింది.
134 పరుగులకే శ్రీలంక ఆలౌట్ అయింది. దీంతో 278 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు టెస్టుల సిరిస్లో భాగంగా భారత్ 1-1తో సమం చేసింది. టెస్టు క్రికెట్కు వీడ్కోలు చెప్పే సమయంలో శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాడు. పి సారా ఓవల్ మైదానంలో అతనికి ఘనంగా వీడ్కోలు పలికారు.
శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘే, ప్రపంచ కప్ను శ్రీలంకకు సాధించి పెట్టిన మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ, భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, భారత క్రికెట్ సభ్యులు, శ్రీలంక క్రికెటర్లు, ఇతర పెద్దలు ఈ వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యారు.
#TeamIndia skipper @imVkohli handing over the signed jersey while paying tribute to the legend - @KumarSanga2 pic.twitter.com/qZQLSnaTsU
— BCCI (@BCCI) August 24, 2015