హైదరాబాద్: వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాతో కోహ్లీసేనతో పాటు మిథాలీ సేన ద్వైపాక్షిక సిరీస్లు ఆడేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టుని కూడా దక్షిణాఫ్రికా పర్యటనకు పంపాలన్న క్రికెట్ దక్షిణాఫ్రికా అభ్యర్ధనకు బీసీసీఐ ఆమోదం తెలిపింది.
ఇరు దేశాలకు చెందిన బోర్డుల పరస్పర ఒప్పందంతో వచ్చే ఏడాది జనవరిలో కోహ్లీసేన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ ద్వైపాక్షిక సిరీస్లో భాగంగా నాలుగు టెస్టులు, ఐదు వన్డేలతో పాటు మూడు ట్వంటీ 20 మ్యాచ్ల సిరిస్ను భారత్ ఆడనుంది.
తాజాగా పురుషుల జట్టుతో పాటు మిథాలీ నేతృత్వంలోని భారత మహిళల జట్టును కూడా దక్షిణాఫ్రికా పర్యటనకు పంపించాలని ఆ దేశ బోర్డు బీసీసీఐని కోరింది. ఇందుకో బీసీసీఐ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం.
'భారత మహిళా క్రికెట్ జట్టును దక్షిణాఫ్రికాకు పంపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇందుకు బీసీసీఐ అంగీకరించింది. మహిళా క్రికెట్ను సైతం ముందుకు తీసుకెళ్లడానికి ఇదొక చక్కటి అవకాశం. ఇందులో మూడు ట్వంటీ 20 మ్యాచ్లను భారత మహిళా జట్టు ఆడనుంది. ఈ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాం' అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
'మహిళా క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనన్ని ఎక్కువ భారత్-ఎ మ్యాచ్లు కూడా నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాం. ఇలా ఒకేసారి రెండు జట్లను ఒకేసారి విదేశీ పర్యటనకు పంపించడం ఇదే తొలిసారి కాదు. జనవరి 2016లో ఇదే తరహాలో ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది' అని తెలిపారు.