హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ ఉమేశ్ యాదవ్ ఇంట్లో దొంగలు పడ్డారు. ఉమేశ్ యాదవ్ ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని ముగ్గురు దొంగలు రూ.45 వేల నగదుతోపాటు రెండు మొబైల్ ఫోన్లను ఎత్తుకెళ్లారు. సోమవారం రాత్రి 7 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ దొంగతనం జరిగినప్పుడు ఉమేశ్ యాదవ్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేరు. నాగ్పూర్లోని లక్ష్మీనగర్ ప్రాంతంలో ఉమేశ్ యాదవ్ ఇల్లు ఉంది. ఈ దొంగతనం విషయమై ఇన్స్పెక్టర్ బీఆర్ ఖండేల్ మాట్లాడుతూ ఉమేశ్ యాదవ్ ఫ్యామిలీ ఎవరూ లేని సమయంలో చోరీ జరిగినట్లు వెల్లడించారు.
మంగళవారం ఉదయం 3.30 గంటలకు ఉమేశ్ యాదవ్ ఇంట్లో చోరీ జరిగినట్లు కంట్రోల్రూంకు ఫోన్ వచ్చినట్లు తెలిపారు. దొంగలు ఉమేశ్ ఇంటిపై భాగంలో ఉన్న కిటికీ అద్దాలు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు తెలిపారు.
ఇటీవలే బిల్డింగ్లోని 8వ అంతస్థులో రిపేర్ పనులు చేసిన ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు వారిలో ఒకరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.