హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సహకారంతోనే తాను భారత జట్టులో చోటు దక్కించుకున్నానని చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు. శ్రీలంకతో ఇటీవలే ముగిసిన సిరీస్లో కుల్దీప్ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం స్వదేశంలో ఆసీస్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరిస్లో భాగంగా చెన్నైలో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లు బౌలింగ్ చేసి 2/33తో సత్తాచాటాడు. దీంతో 2019 వరల్డ్ కప్కి ఎంపిక చేయబోయే జట్టులో కుల్దీప్ తప్పక ఉండాల్సిన క్రికెటర్ అంటూ పలువురు మాజీలు కొనియాడుతున్నారు.
గురువారం కోల్కతాలోని ఈడెన్గార్డెన్స్లో రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో మీడియాతో కుల్దీప్ మాట్లాడాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ గంభీర్.. తనకి ఆ జట్టులో ఎక్కువ అవకాశాలిచ్చి ప్రోత్సహించాడని కుల్దీప్ యాదవ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
'గౌతమ్ గంభీర్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. క్రికెట్ ప్రపంచానికి నేను ఎవరో తెలియక ముందు నుంచే అతను నాకు మద్దతుగా నిలిచాడు. అతడి కెప్టెన్సీలో కోల్కతా నైట్రైడర్స్ జట్టు నుంచి చాలా నేర్చుకున్నా. భారత్ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాలని నేను ఎప్పుడూ కోరుకునేవాడిని. ఆ కల గంభీర్ లాంటి వ్యక్తుల సలహాతోనే సాధ్యమైంది' అని కుల్దీప్ అన్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడటానికి ముందు కుల్దీప్ ముంబై ఇండియన్స్కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే తొలి నాళ్లలో ముంబై ఇండియన్స్ అతడిని రిజర్వ్ బెంచ్కే ఎక్కువ పరిమితం చేసింది.