హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరిస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగనున్న మిగతా రెండు టెస్టులకు ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ దూరం కానున్నాడు.
భుజం గాయం కారణంగా మిచెల్ మార్ష్ మిగతా రెండు టెస్టులకు దూరమవుతున్నట్లు ఆసీస్ ఫిజియోథెరపిస్టు డేవిడ్ తెలిపారు. 'కొంతకాలంగా మిచెల్ మార్ష్ భుజం గాయంతో బాధ పడుతున్నాడు. సమ్మర్ సీజన్ లో చాలా వరకు ఇలానే ఆడాడు. ఇప్పటివరకు ఇలాగే మేనేజ్ చేశాం. గాయం ఎక్కువకావడంతో అతడు ఆడలేకపోతున్నాడు'అని ఆయన అన్నారు.
నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకునేందుకు మార్ష్ స్వదేశానికి తిరిగిరానున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో మిచెల్ మార్ష్ పెద్దగా రాణించలేదు. నాలుగు ఇన్నింగ్స్లో కలిపి 48 పరుగులు మాత్రమే సాధించాడు. ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అతడి స్థానంలో ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. మార్ష్ స్థానంలో ఉస్మాన్ ఖ్వాజా, గ్లెన్ మ్యాక్స్ వెల్ ను ఆడించే అవకాశాలున్నామని కోచ్ డారెన్ లీమాన్ తెలిపాడు.
నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్లో ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచాయి. దీంతో సిరిస్ 1-1తో సమమైంది. ఈ సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు మార్చి 16నుంచి రాంచీలో ప్రారంభం కానుంది. ఇక నాలుగో టెస్టు ధర్మశాలలో జరగనుంది.