హైదరాబాద్: రాంచీ టెస్టులో తొలి రోజు ఆట భాగంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భుజానికి గాయమైన సంగతి తెలిసిందే. అయితే ఈ గాయం అందరూ అనుకున్నట్లు చిన్న గాయమేమీ కాదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. కోహ్లీ తన గాయం తీవ్రతను దాచిపెట్టాడని క్లార్క్ చెప్పాడు.
డ్రస్సింగ్ రూమ్కే పరిమితమైన కోహ్లీ: గాయంపై బీసీసీఐ ఇలా
'కోహ్లీ మైదానంలో ఉండటం అత్యంత కీలకం. నిజానికి ఈ గాయం అందరూ అనుకున్నట్లు చిన్న గాయమేమీ కాదు. నాకు తెలిసినంత వరకు అతడు మైదానంలోకి రావడానికి ఉన్న అన్ని మార్గాల్నీ ప్రయత్నించాడు. ఎందుకంటే ఒక సారథిగా జట్టును ముందుకు నడిపించడం ఎంత ముఖ్యమో అతడికి తెలుసు' అని అన్నాడు.
'అందుకు కోహ్లీని అభినందించి తీరాల్సిందే. రాంచీ టెస్టు మ్యాచ్ క్రెడిట్ తప్పక కోహ్లీ ఇవ్వాలి. వచ్చే మ్యాచ్కు వంద శాతం కోహ్లీ పూర్తిగా కోలుకుంటాడు' అని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. రాంచీ టెస్టు తొలి రోజు ఆటలో భాగంగా ఇన్నింగ్స్ 40వ ఓవర్లో బంతిని ఆపేందుకు డైవ్ చేసినప్పుడు కెప్టెన్ కోహ్లీ భుజానికి గాయమైంది.
జడేజా విసిరిన తొలి బంతిని బౌండరీగా తరలించేందుకు ఆసీస్ బ్యాట్స్మెన్ పీటర్ హ్యాండ్స్ కోంబ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో మిడాన్ నుంచి బాల్ను వెంబండించిన కోహ్లీ బౌండరీ దాటకుండా ఆపేందుకు డైవ్ చేశాడు. ఆ ప్రయత్నంలో కుడి భుజంపై అతని బరువంతా పడింది.
అనంతరం వెంటనే పైకి లేచిన కోహ్లీ తన భుజాన్ని పట్టుకుని ఇబ్బంది పడుతూ కనిపించాడు. భారత ఫిజియో వెంటనే మైదానంలోకి వచ్చి అతడిని తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. కోహ్లీ గాయంపై అభిమానులు ఆందోళన చెందిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీ రెండో రోజు మైదానంలో అడుగు పెట్టలేదు. ఆ తర్వాతి రోజు కోహ్లీ బ్యాటింగ్కు దిగాడు.