హైదరాబాద్: తమ జట్టులో అత్యంత నైపుణ్యం కలిగిన ఫీల్డర్లు ఉన్నారని, వారే భారత్పై మ్యాచ్లు గెలిపిస్తారని ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెడ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. 'ఓ మ్యాచ్ గెలవాలన్నా.. ఓడాలన్నా ఫీల్డింగే కారణమవుతుంది. మూ ఫీల్డింగ్ను చూసి ఆస్ట్రేలియన్లు గర్వపడతారు. ఈ నైపుణ్యం మెరుగు పరుచుకునేందుకు మేం చాలా కష్టపడ్డాం' అని చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ అనంతరం ట్రావిస్ హెడ్ అన్నాడు.
'ఒత్తిడిలో మేం బాగా ఆడతాం. మాకు అద్భుతమైన ఫీల్డర్లు ఉన్నారు. ఈ విషయంలో మా జట్టు గర్వపడాల్సి ఉంది. తమ ఫీల్డింగ్తో మ్యాచ్లను గెలిపించిన ఆటగాళ్లను మేం చూశాం. డేవిడ్ వార్నర్, స్టీవ్స్మిత్, మాథ్యూవేడ్, స్టొయినిస్తో మా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఫాల్క్నర్ కూడా ఉన్నాడు. మేం ఒక్కరిపైనే ఆధారపడం' అని హెడ్ పేర్కొన్నాడు.
సెప్టెంబర్ 17 నుంచి భారత్తో జరిగే వన్డే సిరిస్లో ఆస్ట్రేలియా జట్టు టాప్ ఆర్డర్లో చోటు దక్కితుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'తుది జట్టులో స్ధానంపై ఆతృతగా ఉన్నా. నేను నాలుగో స్థానంలో బ్యాటింగ్కు వస్తానని ఆశిస్తున్నా. ఓపెనర్లు పని పూర్తిచేసిన తర్వాత మిడిలార్డర్లో నేను, మాక్స్ మంచి ఇన్నింగ్స్ ఆడాలని కోరుకుంటున్నాం' అని తెలిపాడు.
ఇక ఆసీస్ బ్యాటింగ్ లైనప్ విషయానికి వస్తే డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మ్యాథ్యూ వేడ్లతో పటిష్టంగా ఉందని పేర్కొన్నాడు. బ్యాటింగ్లో ఏ ఒక్కరిపైనే జట్టు ఆధారపడి లేదని తెలిపాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నైతిక విలువలున్న వ్యక్తి అని, పరిస్థితులను అనుసరించి త్వరగా కుదురుకుంటాడని, అది అనుభవంతోనే వస్తుందేమోనని హెడ్ అన్నాడు.
కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ట్రావిస్ హెడ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే.