10 ఓవర్లు వేసిన అశ్విన్ 70 పరుగులు
ఈ మ్యాచ్లో 10 ఓవర్లు వేసిన అశ్విన్ 70 పరుగులు సమర్పించుకున్నాడు. స్పిన్నర్లు అశ్విన్ (10 ఓవర్లు), జడేజా (8), కేదార్ జాదవ్ (3) కలిసి 21 ఓవర్లు వేసి 164 పరుగులు ఇచ్చారు. పాకిస్థాన్ చేసిన స్కోరులో ఇవి దాదాపుగా సగం పరుగులకి సమానం. పిచ్ బ్యాటింగ్కు అనుకూలిస్తుండటంతోపాటు భారత బౌలర్లు ఎక్స్ట్రాలు ఎక్కువ ఇవ్వడం కూడా పాకిస్థాన్ భారీ స్కోరు చేసింది.
భారత స్పిన్నర్లు పూర్తిగా విఫలం
పాక్ బ్యాట్స్మెన్ దూకుడును కట్టడి చేయడంలోనూ పరుగుల వరదకు అడ్డుకట్ట వేయడంలోనూ భారత స్పిన్నర్లు పూర్తిగా విఫలమయ్యారు. మిడిల్ ఓవర్లలో పరుగులు అడ్డుకుంటారనుకున్న స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడ్డేజాలు చేతులెత్తేశారు. అశ్విన్, జడ్డేజా కలిసి వేసిన 18 ఓవర్లో పాక్ బ్యాట్స్మెన్ 137 పరుగులు సమర్పించుకున్నారు.
డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా పేరొందిన బుమ్రా సైతం విఫలం
స్పిన్నర్లు ప్రభావం చూపకపోవడంతో పాక్ను పరిమిత లక్ష్యానికి నిలువరించాలన్న టీమిండియా ఆలోచనను భారీగా దెబ్బతీసింది. ఇక డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా పేరొందిన బుమ్రా సైతం ఒత్తిడిని తట్టుకొని నిలబడలేకపోయాడు. తొమ్మిది ఓవర్లు వేసిన అతను ఏకంగా 68 పరుగులు సమర్పించుకున్నాడు. భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా 3 నోబాల్స్, 5 వైడ్లు వేశాడు.
ఆరంభంలోనే చేజారిన సువర్ణావకాశం
తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్కు దిగిన పాక్ను ఒత్తిడిలోకి నెట్టే సువర్ణావకాశం ఆరంభంలోనే చేజారింది. బుమ్రా బౌలింగ్లో ఫకార్ జమాన్ ఆరంభంలోనే అవుటై ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో. కానీ అది నోబాల్ కావడం.. అతనికి లైఫ్ లభించడం టీమిండియా పాలిట శాపమైంది. 3 పరుగుల వద్ద అవుట్ కావాల్సిన ఆటగాడు 114 పరుగులతో సెంచరీ చేశాడు.
చివర్లో అదనపు పరుగులు 25
బుమ్రా నోబాల్తో సహా ఫైనల్లో టీమిండియా సమర్పించుకున్న అదనపు పరుగులు 25. అందులో 13 వైడ్లు, 3 నోబాల్స్ ఉన్నాయి. భారత బౌలర్లలో ఒక్క భువీ మాత్రమే మెరుగైన ప్రదర్శన చేశాడు. 10 ఓవర్లలో ఓ వికెట్ తీసుకొని.. 44 పరుగులు ఇచ్చాడు. ఇందులో రెండు మెయిడెన్ ఓవర్లు ఉన్నాయి.
భువీ తర్వాత పాండ్యానే
ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ కాస్తో-కూస్తో తోడుగా నిలిచింది హార్దిక్ పాండ్యా మాత్రమే. పాండ్యా 10 ఓవర్లలో ఓ వికెట్ తీసుకొని 53 పరుగులు ఇచ్చాడు. దీనిని బట్టి చూస్తే ఈ పిచ్పై స్పిన్నర్ల కంటే పేసర్లే అంతో ఇంతో ప్రభావం చూపగలుగుతారనడానికి ఈ గణాంకాలే నిదర్శనం.
ఇంకో ఫాస్ట్ బౌలర్ ఉండే బాగుండేది
నిజానికి ఇంగ్లాండ్ పరిస్థితులు పేసర్లకే కాస్త అనుకూలం. ఫ్లాట్ పిచ్పై స్పిన్నర్లు ప్రభావం చూపలేరు కాబట్టి ఉమేశ్యాదవ్ లేదా షమిలలో ఒకరిని తీసుకున్నా ఫలితం మరోలా ఉండేదేమో. భువనేశ్వర్ బౌలింగ్ చూశాక అతనికి తోడుగా మరో ఫాస్ట్ బౌలర్ ఉండుంటే బాగుండేదని సగటు క్రికెట్ అభిమానికి అనిపించింది.