హైదరాబాద్: రెండో టెస్టులో ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓటమి పాలవ్వడంపై శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమాల్ ఆవేదన వ్యక్తం చేశాడు. కొలంబో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలవ్వడం తనను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందని చెప్పాడు.
ఆదివారం మ్యాచ్ ముగిసిన అనంతరం చండీమాల్ మీడియాతో మాట్లాడాడు. 'మా జట్టు ప్రదర్శన ఎంతగానో నిరాశ పరిచింది. తొలి ఇన్నింగ్స్లో తక్కువ పరుగులకే ఆలౌట్ అవడంతో భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాం. పర్యాటక జట్టు భారత్ తొలి ఇన్నింగ్స్లో ఆరొందలకు పైగా స్కోరు చేస్తే, తమ జట్టు ఘోరంగా రెండొందల లోపే ఆలౌట్ కావడం బాధించింది' అని అన్నాడు.
'ఇలాంటి చెత్త ప్రదర్శనను అస్సలు ఊహించలేదు. భారత జట్టు ప్రదర్శన అమోఘం. వారు తొలుత భారీ పరుగులు చేసి మమ్మల్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. కాకపోతే తాము స్థాయికి తగ్గ ఆటను ఆడలేదు' అని చండీమాల్ వాస్తవాన్ని అంగీకరించాడు.
రెండో ఇన్నింగ్స్లో తమ జట్టు గట్టిగానే ప్రతిఘటించిందని చండీమాల్ పేర్కొన్నాడు. కుశాల్ మెండిస్, దిముత్ కరుణరత్నే అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. గత మూడు నాలుగేళ్లలో అలాంటి ఇన్నింగ్స్ను తాను చూడలేదని పేర్కొన్నాడు.
రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీసి భారత్ ఇన్నింగ్స్ విజయం సాధించడానికి సహకరించిన భారత స్పిన్నర్ రవీంద్ర జడేజాపై చండిమాల్ ప్రశంసలు కురిపించాడు. అతను నిజంగా ప్రత్యేకమైన బౌలర్ అని అభివర్ణించాడు. జడేజా ఒక వైవిధ్యమైన బౌలర్ కాబట్టే నంబర్ వన్ ర్యాంక్ని సొంతం చేసుకున్నాడని అన్నాడు.