హైదరాబాద్: పని భారం ఎక్కువ కావడంతో శ్రీలంకతో ఆగస్టు 20 నుంచి జరగనున్న వన్డే సిరిస్లో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పేసర్ మహమ్మద్ షమీకి కూడా విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.
కోహ్లీసేన ప్రస్తుతం మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండు టెస్టులు ముగిశాయి. చివరిదైన మూడో టెస్టు శనివారం నుంచి పల్లెకెలె వేదికగా ప్రారంభం కానుంది.
ఈ టెస్టు సిరిస్లో ఇప్పటివరకు జడేజా 108.2 ఓవర్లు వేయగా, అశ్విన్ 108.3 ఓవర్లు వేశాడు. ఇక సస్పెన్షన్ కారణంగా మూడో టెస్టుకు జడేజా దూరమైన సంగతి తెలిసిందే. ఇక మూడో టెస్టులో అశ్విన్ ఓవర్లు వేస్తే ఆ సంఖ్య 150కిపైగా చేరుకునే అవకాశం ఉంది.
మరోవైపు యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, కృనాల్ పాండ్యా జట్టులో స్థానం కోసం పోటీలో ఉన్నారు. శ్రీలంకతో ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఎమ్మెస్కే నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆగస్టు 13న జట్టును ప్రకటించనుంది. ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఆగస్టు 20న జరగనుంది.
ఈ సీజన్లో కోహ్లీసేన తీరిక లేకుండా క్రికెట్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో జట్టు మేజ్మెంట్ ఆటగాళ్లపై పనిభారం మరీ ఎక్కువగా పడకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. లంక పర్యటన ముగిసిన తర్వాత కోహ్లీసేన ఆస్ట్రేలియా, కివీస్లతో వన్డే సిరిస్లను ఆడనుంది. ఈ ఏడాది చివర్లో శ్రీలంక తిరిగి భారత పర్యటనకు రానుంది.
మరోవైపు వచ్చే ఏడాది మొదట్లో టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తుంది. ఆ తర్వాత శ్రీలంకలో ఇండిపెండెన్స్డే కప్లో పోటీ పడుతుంది. ఆ తర్వాత ఐపీఎల్ 2018. ఈ తీరికలేని షెడ్యూలు నేపథ్యంలో, ఇప్పటికే విశ్రాంతి లేకుండా ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా విశ్రాంతి ఇవ్వొచ్చన్న చర్చ జరుగుతోంది.