న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి, బోర్డర్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్తో అన్ని రకాల సంబంధాలను తెంచుకోవాలని టీమిండియా ఆటగాడు గౌతం గంభీర్ అన్నాడు. మంగళవారం గంభీర్ ఈ విషయమై స్పందించాడు. పాకిస్థాన్ నటీనటులకు బాలీవుడ్ ప్రముఖులు మద్దతు తెలపడాన్ని గంభీర్ తప్పుబట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేవరకు పాకిస్థాన్తో క్రికెట్ లేదా బాలీవుడ్కు సంబంధించి ఎలాంటి సంబంధాలనూ భారత్ పెట్టుకోరాదని పేర్కొన్నాడు. క్రికెట్, సినిమాలను జాతీయ మనోభావాలకు భిన్నంగా చూడాలని బాలీవుడ్ ప్రముఖులు చెప్పడం తనకు దిగ్ర్భాంతిని కలిగించిందని అన్నాడు.
'క్రీడల కంటే భారతీయుల ప్రాణాలు ఎంతో విలువైనవి. పాకిస్థాన్తో క్రికెట్ ఆడాలన్న ఊహ కూడా తనకు రాదు' అని గంభీర్ స్పష్టం చేశాడు. ఉగ్రవాదం కారణంగా ఎంతో మంది తమ ఆప్తులను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమాధానం చెప్పాలని సూచించాడు.
'దేశ ప్రజల గురించి ఆలోచించనంత వరకు క్రికెట్ లేదా బాలీవుడ్ను రాజకీయాలతో ముడిపెట్టవద్దని ఏసీ రూముల్లో కూర్చుని మాట్లాడతూనే ఉంటాం. మన దేశ ప్రజలను మనం కాపాడుకోలేనంత వరకు అన్ని రకాల సంబంధాలను పక్కన పెట్టేయాలనేదే నా అభిప్రాయమ'ని గంభీర్ తెలిపాడు.
పాకిస్థాన్ నటీనటులకు మద్దతుగా మాట్లాడుతున్న వారు.. ఆ దేశం కారణంగా తమ కుటుంబ సభ్యులు మరణిస్తే ఇలాగే వ్యవహరిస్తారా? అని గంభీర్ ప్రశ్నించాడు. ఇటీవలే న్యూజిలాండ్తో ముగిసిన టెస్టు సిరిస్లో భాగంగా గంభీర్ తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.
అయితే గంభీర్ ఒక్కడే ఇలా పాకిస్థాన్పై మాట్లాడలేదు. సెప్టెంబర్ 18న యూరీలోని ఆర్మీ క్యాంపుపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడి అనంతరం టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా దాడులను ఖండించాడు. యూరీ ఉగ్రదాడిలో భారత ఆర్మీకి చెందిన 19 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
కోహ్లీతో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని గంభీర్ తెలిపాడు. కోహ్లితో వ్యక్తిగతంగా తనకు ఎటువంటి విభేదాలు లేవని గంభీర్ తెలిపాడు. మైదానంలో తామిద్దరి భావోద్దేగాలు ఒకరకంగా ఉంటాయని చెప్పాడు.
'ఐపీఎల్ మ్యాచ్ లో కావాలనే కోహ్లితో గొడవ పడలేదు. ఇందులో వ్యక్తిగత విభేదాలు లేవు. విరాట్కు వ్యతిరేకంగా ఆడాల్సి వస్తే దూకుడుగా ఉండక తప్పద'ని అన్నాడు. 2013 ఐపీఎల్ లో కోహ్లి, గంభీర్ మైదానంలో తిట్టుకున్న సంగతి తెలిసిందే.
'విరాట్, నేను మైదానంలో దూకుడుగా వ్యవహరిస్తుంటాం. ఆట పట్ల మాకు ఎంతో ప్రేమ ఉంది. మేమిద్దరం ఒక జట్టులో ఉంటే ఒకే లక్ష్యం కోసం ఆడతామ'ని గంభీర్ చెప్పాడు. మార్గదర్శిలా కోహ్లి కెప్టెన్సీ ఉందని కితాబిచ్చాడు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత ఇరుదేశాల మధ్య ఇప్పటి వరకూ ఒక్క ద్వైపాక్షిక సిరిస్ కూడా జరగలేదు. జనవరి 2009లో పాకిస్థాన్లో భారత్ పర్యటించాల్సి ఉన్నా, ముంబై ఉగ్రదాడుల కారణంగా ఆ పర్యటన ఆగిపోయింది.