హైదరాబాద్: మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడాలన్న తన కల నిజమైందని పూణె మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మనోజ్ తివారి తెలిపాడు. ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా వాంఖడె వేదికగా జరిగిన క్వాలిఫయిర్-1లో పూణె విజయంలో వీరిద్దరి జోడి కీలకపాత్ర పోషించింది.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ను ఓడించి ఐపీఎల్ ఫైనల్స్కు అర్హత సాధించింది. ఈ సందర్భంగా పూణె విజయంలో కీలక పాత్ర పోషించిన మనోజ్ తివారి తన మనసులోని మాటలను అభిమానులతో పంచుకున్నాడు.
మ్యాచ్ అనంతరం తివారి మీడియాతో మాట్లాడాడు. 'ఈ మ్యాచ్ ద్వారా నా కల నిజమైంది. మైదానంలో ధోనీతో కలిసి బ్యాటింగ్ చేయాలన్న కల ఇన్నాళ్లకు సాకారమైంది. భారత్ తరఫున మ్యాచ్లాడాను. ఎన్నో పర్యటనలకు వెళ్లాను. కానీ, ధోనీతో బ్యాటింగ్ చేసే అవకాశం ఎప్పుడూ రాలేదు. ఈ రోజు నా కోరిక నెరవేరింది' అని తివారీ అన్నాడు.
'ధోనీతో కలిసి ఆడాలని చాలా మంది క్రికెటర్లు కలలుకంటుంటారు. ఇప్పటి వరకు ధోనీ సిక్స్లు కొట్టడం డ్రెస్సింగ్ రూమ్ నుంచే చూశాను. ఈ మ్యాచ్లో మైదానం మరో ఎండ్లో ఉండి ధోనీ సిక్స్లు బాదడం చూశాను' అని తివారి పేర్కొన్నాడు.
ధోని-తివారిల జోడీ నాలుగో వికెట్కు 73 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో నిర్ణీత 20 ఓవర్లలో పూణె 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అనంతరం పూణె నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి ఓటమి పాలైంది. [స్కోరుకార్డు]
ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన మెక్లనగాన్ బౌలింగ్లో ధోని రెండు సిక్సర్లు కొట్టి స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. మనోజ్ తివారీ కూడా ఒక ఫోర్, ఒక సిక్స్ బాదడంతో ఈ ఓవర్లో పుణె ఏకంగా 26 పరుగులు సాధించింది. చివరి ఓవర్ వేసిన బుమ్రాపై కూడా ధోని విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్లో రెండు సిక్స్లు బాదిన ధోని 15 పరుగులు రాబట్టారు.